తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా పాత మద్యం పాలసీలో భారీ మార్పులు చేయబోతుంది. దీని ప్రకారం.. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును భారీగా పెంచడమే కాక.. గడువును కూడా పెంచేందుకు రెడీ అవుతోంది. మార్పులు చేసిన కొత్త మద్యం పాలసీని స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంగళవారం నాడు ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ భేటీలో నూతన మద్యం పాలసీపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఈకొత్త మద్యం పాలసీని స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే అమలు చేసి.. మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. నూతన మద్యం పాలసీ ప్రకారం.. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటి వరకు రెండేళ్ల గడువుతో మద్యం షాపులకు లైసెన్స్ ఇస్తుండగా.. ఇకపై దాన్ని మూడేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త మద్యం పాలసీ అమలు చేస్తే.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి 30 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ప్రచారం జరుగుతోంది.
కేవలం మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయం ద్వారానే రూ.3,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అలానే నూతన లైసెన్సీలు..ఒక సంవత్సరం ఎక్సైజ్ ఫీజును.. రిటైల్షాప్లకు అడ్వాన్స్గా చెల్లించే విధంగా నూతన పాలసీని రూపొందించినట్టు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల రూ.24 వేల కోట్లు ముందుగానే ప్రభుత్వ ఖజానాలో జమ అవుతాయిని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ4 వైన్ షాపులు 2,620 వరకు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 690 మద్యం దుకాణాలున్నాయి. వీటి లైసెన్స్ కేటాయింపు కోసం ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించి.. లాటరీ పద్దతిన కేటాయిస్తారు. ప్రస్తుతం 2023-25 లైసెన్స్ కాలం అమల్లో ఉంది.ఈ గడువు ఈ ఏడాది నవంబరు 30తో ముగియనుంది.
అయితే.. హైకోర్టు తీర్పు మేరకు.. తెలంగాణలో సెప్టెంబరులోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉంటాయనే ప్రచారంతో.. ఈ సారి ఆ ఎలక్షన్ కన్నా ముందే.. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేయాలని తెలంగాణ ఎక్సైజ్శాఖ భావిస్తోంది. అంటే.. ఆగస్టులోనే మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణను పూర్తిచేసి.. లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించడానికి ఎక్సైజ్శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో 2019లో చివరిసారిగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును పెంచారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత అనగా ఇప్పుడు మళ్లీ దాన్ని 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం దుకాణాన్ని ఎక్కడ కేటాయిస్తే.. అక్కడే నడుపుకోవాలనే నిబందన అమల్లో ఉంది. కొత్త పాలసీలో దీన్ని సడలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa