ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొర్రెల పంపిణీ పథకంలో రూ. వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు.. ఈడీ సంచలన ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 07:47 PM

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ కేసు మనీలాండరింగ్ కోణంలో విచారించిన ఈడీ అధికారులు, హైదరాబాద్‌లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.


ఈడీ దర్యాప్తులో షాకింగ్ వివరాలు..


ఈడీ అధికారులు గత ప్రభుత్వంలోని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా ఉన్న జి. కల్యాణ్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్లు ఈడీ ప్రకటించింది.


కల్యాణ్ కుమార్ ఇంట్లో 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాస్ బుక్‌లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాంక్ ఖాతాలను ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో కూడా వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.


 లబ్ధిదారులకు అందాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఈడీ ప్రకటించింది. అసలు గొర్రెల కొనుగోలు లేదా విక్రయం జరగకుండానే డబ్బులు స్వాహా చేసినట్లు తేలింది. వివిధ ప్రభుత్వ అధికారులకు ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలు కూడా లభ్యమయ్యాయి.


కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా గొర్రెల పంపిణీలో కుంభకోణం జరిగినట్లు గుర్తించింది. మార్చి 2021తో ముగిసిన కాలానికి సంబంధించిన కాగ్ ఆడిట్‌లో పథకం అమలులో అనేక అవకతవకలు వెల్లడయ్యాయి. లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్ రికార్డులు అసంపూర్ణంగా ఉండటం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్‌కు చెల్లింపులు చేయడం వంటివి గుర్తించారు. చనిపోయిన లేదా ఉనికిలో లేని వ్యక్తుల పేరుతో కూడా గొర్రెల యూనిట్లను కేటాయించినట్లు తేలింది.


గత ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని మొదలుపెట్టింది. రెండు విడతలుగా సుమారు 4.25 లక్షల యూనిట్లను పంపిణీ చేసినట్లు చూపించి, ఇందుకోసం దాదాపు 4 వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అయితే.. కొన్ని యూనిట్లనే పంపిణీ చేసి, ఎక్కువ కొన్నట్లు చూపించడం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డారు.


ఈ కేసులో అక్రమాలు జరిగాయంటూ గతంలోనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేసి అప్పట్లోనే 17 మందిని అరెస్టు చేశారు. ఏసీబీ కేసు ఆధారంగా.. మనీలాండరింగ్ కోణంలో గతేడాది జూన్‌లో ఈడీ ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత, ఇంకా ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసు మరింత మంది ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa