ప్రస్తుతం తెలంగాణలో ప్రమోషన్ల పర్వం నడుస్తోంది. తాజాగా విద్యాశాఖలో గెజిటెడ్ హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా జీహెచ్ఎంసీలో కూడా 22 మందికి పదోన్నతి కల్పిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లో విధుల్లో చేరాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
2024–25 సంవత్సరానికి గానూ జీహెచ్ఎంసీలో 22 మంది సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా(ఏఎంసీ) ప్రమోషన్ ఇచ్చారు. ఈమేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబరితి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది జులై 29న డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో సూపరింటెండెంట్ల సీనియారిటీ, వారి పని తీరు, సర్వీస్ నిబంధనలును క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని అర్హతలను పరిగణలోనికి తీసుకుని 22 మందికి ఏఎంసీలుగా ప్రమోషన్ కల్పించేందుకు ప్రభుత్వం సిఫార్సు చేసింది.
ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న కీలక ఏఎంసీ పోస్టులు భర్తీ కానున్నాయి. డీపీసీ సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం, తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమోషన్ పొందిన ఉద్యోగులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా వారికి కేటాయించిన కొత్త పోస్టుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా విధుల్లో చేరకుంటే.. అలాంటి ఉద్యోగుల పదోన్నతి రద్దవుతుందని ఉత్తర్వుల్లో హెచ్చరికలు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పదోన్నతులు.. కోర్టులు, ట్రిబ్యునళ్లలో పెండింగ్లో ఉన్న కేసులలో వెలువడే ఫైనల్ తీర్పులకు లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, పదోన్నతి పొందిన వారిలో సూపరింటెండెంట్ బి.స్వామి అనే ఉద్యోగి గురువారం రిటైర్డ్ కావడం గమనార్హం.
ఇదిలా ఉంచితే ఇటీవల తెలంగాణ సర్కార్.. నీటి పారుదల శాఖలో ప్రమోషన్లకు లైన్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ శాఖలో పనిచేస్తున్న దాదాపు 127 మంది ఏఈఈలుగా ప్రమోషన్ పొందారు. వీరంతా 18 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈక్రమంలో వీరి సమస్య తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే వారు పదోన్నతులు పొందడానికి ఉన్న అడ్డంకులను తొలగించి.. పదోన్నతులకు లైన్ క్లియర్ అయ్యేలా చేశారు. దీంతో ఉద్యోగులు మంత్రి ఉత్తమ్కి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు తాజాగా జీహెచ్ఎంసీలో కూడా 22 మందికి ప్రమోషన్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa