ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వర్సిటీకి మరో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు.. 4 బీటెక్ కోర్సులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 08:01 PM

ఈ సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి, రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తవ్వగా.. ఎప్‌సెట్ లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. తుది విడత కౌన్సెలింగ్ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. దీని కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు బీ కేటగిరీ సీట్లకు కూడా నోటిఫికేషన్ విడుదల కావడంతో వాటిలో చేరేందుకు కూడా విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.


తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య..


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300కు పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) లెక్కల ప్రకారం, సుమారు 171 ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,07,218 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఒక కొత్త ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవో జారీ చేసింది.


ఈ కొత్త కళాశాల ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఇందులో 4 బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. ఆ కోర్సులు.. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, డేటా సైన్స్.


ఈ ప్రతి కోర్సులోనూ 60 సీట్లు ఉంటాయి. దీనికి అదనంగా.. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) కోటా కింద మరో 10 శాతం, అంటే 24 సీట్లు కలుస్తాయి. ప్రభుత్వ అనుమతి లభించిన నేపథ్యంలో, ఆగస్టు 5 నుంచి నిర్వహించే తుది విడత ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ కొత్త సీట్లను భర్తీ చేస్తారు. ఈ నిర్ణయం ఇంజినీరింగ్ విద్యార్థులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది.


ఫీజుల విషయంలో పాత విధానమే..


ఈ సంవత్సరం ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూలులో పాత విధానాన్నే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. సాధారణంగా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు అధికంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఫీజుల పెంపుదలపై చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే.. ఈసారి పాత ఫీజులనే కొనసాగించడం వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గుతుంది.


ఈ కొత్త కళాశాల ఏర్పాటు.. కోర్సుల విస్తరణతో పాటు ఫీజుల విషయంలో పాత విధానాన్ని కొనసాగించడం, తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యను మరింత చేరువ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa