తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. వరద నీరు వృథాగా పోకుండా అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని అధికారులు వరదల నియంత్రణకు 'స్పాంజ్ పార్కులను' ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ముంపు సమస్య ఎక్కువగా ఉన్నందున, రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోని వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడానికి ఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు సీడీఎంఏ టీకే. శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.
స్పాంజ్ పార్కుల ఆవశ్యకత..
స్పాంజ్ పార్కులు అనే ఆలోచన చెన్నై నగరం నుంచి ప్రేరణ పొందింది. సుమారు 11 ఏళ్ల క్రితం చెన్నై నగరాన్ని వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. రహదారులు, కాలనీలు, విమానాశ్రయం పూర్తిగా నీట మునిగి ఐదు, ఆరు రోజుల పాటు జనజీవనం స్తంభించింది. ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకొని, వరద ముంపును తగ్గించడానికి చెన్నైలో 57 స్పాంజ్ పార్కులను ప్రతిపాదించగా, ప్రస్తుతం 21 పార్కులు నిర్మాణ దశలో ఉన్నాయి.
స్పాంజ్ పార్కులు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.. వాటిలో వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా వరదల తీవ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ పార్కులలో నిల్వ ఉన్న నీరు భూమిలోకి ఇంకి, భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతుంది, తద్వారా వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడిని అధిగమించవచ్చు. ఈ పార్కులను పచ్చదనంతో నిండిన ప్రాంతాలుగా అభివృద్ధి చేయవచ్చు.. ఇది నగరంలో పచ్చదనాన్ని పెంచడానికి దోహదపడుతుంది. అంతే కాకుండా.. ఈ పార్కుల నిర్మాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.. కానీ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.
గ్రేటర్ వరంగల్ ప్రణాళికలు..
గ్రేటర్ వరంగల్ పరిధిలో 45 లోతట్టు ప్రాంతాలు.. అలాగే వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 25 ప్రధాన రహదారులకు తరచుగా వరద ముంపు సమస్య ఉంది. ఇలాంటి ప్రాంతాల్లోనే స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకురాలు ఆదేశించారు. వరంగల్, హనుమకొండలోని కొన్ని కీలక ప్రాంతాలు, ఇక్కడ స్పాంజ్ పార్కులను ఏర్పాటు చేయాలని ఇంజినీర్లు సూచిస్తున్నారు. కాజీపేట ఎన్ఐటీ, హనుమకొండ వడ్డేపల్లి సెంటర్, అదాలత్ సెంటర్, నక్కలగుట్ట, కేయూసీ కూడలి, హనుమకొండ చౌరస్తా, అలంకార్, వరంగల్లో ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, కాశీబుగ్గ, వరంగల్ అండర్బ్రిడ్జి, హంటర్రోడ్, పాపయ్యపేట వంటి ప్రాంతాల్లో వీటిని నిర్మించున్నట్లు తెలుస్తోంది.
నక్కలగుట్ట సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఇప్పటికే స్పాంజ్ పార్కు తరహాలో భారీ ఇంకుడు గుంత నిర్మాణం జరుగుతోంది. ఇది 9/5 అడుగుల పొడవు, 6/4 అడుగుల వెడల్పుతో 228 క్యూబిక్ మీటర్ల లోతు ఉంటుంది. ఇలాగే హసన్పర్తి, చింతగట్టు, టేకులగూడెం, తరాలపల్లి విలీన గ్రామాల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఈ నమూనాను అనుసరించి, వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో స్పాంజ్ పార్కుల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఈ చర్యలతో వర్షాకాలంలో ప్రజలకు వరద కష్టాలు తీరుతాయని అధికారులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa