తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారందరికీ అందజేసిన పింఛన్లను రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో సుమారు 28 వేల మంది నుంచి.. ఏకంగా 60 కోట్ల రూపాయల పింఛను మొత్తాన్ని రికవరీ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఆదేశించింది.. ఎవరి పింఛన్లు రికవరీ చేయనున్నారు అనే వివరాలు మీకోసం..
చనిపోయిన వారికి మంజూరు చేసిన పింఛన్లను రికవరీ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంవత్సర క్రితం చనిపోయిన పింఛనుదారులకు కూడా చేయూత పెన్షన్లు అందజేశారు. ఈ క్రమంలో పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇలా 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) తాజాగా గుర్తించింది.
చేయూత పింఛన్లు అందుకుంటూ మరణించిన పలు విభాగాల లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేయలేదు. దీంతో సంవత్సర కాలంగా చనిపోయిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీ లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారు. అందువల్లే ఈ సమస్య ఎదురయ్యిందని అధికారులు తెలిపారు. ఈ లబ్దిదారుల్లో కొందరికి నెలకు రూ.2,016, దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయల చొప్పున సంవత్సర కాలం పాటు ప్రతి నెల వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో.. సదరు పింఛన్దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరణించిన లబ్ధిదారులు పేరు మీద జమ అయిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులు.. చనిపోయిన వారి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి.. ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతోపాటుగా మరణించిన 28 వేల మంది పింఛనుదారుల పేర్లను జాబితా నుంచి తొలగించిన్లుగా అధికారులు ప్రకటించారు. అలానే వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి.. మరణించిన వారి భార్య లేదా భర్తకు పెన్షన్ అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పింఛన్ల జారీలో మోసాలను అరికట్టడానికి.. సమస్యలను తొలగించడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెల అనగా జులై 29 నుంచి జూలై పింఛన్ పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. పెన్షన్ లబ్ధిదారుల్లో కొందరికి వేలిముద్రలు సరిగా లేకపోవడంతో పాటుగా మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో భాగంగా పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే 23 లక్షల మందికి ఈ విధానాన్ని వర్తింపచేయనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్, కొత్త స్మార్ట్ఫోన్లు, సిబ్బందికి శిక్షణ వంటి పనులు పూర్తి చేశారు. ఈ కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa