ఉపాధి హామీ కూలీలుగా సినిమా హీరోయిన్లు. హీరోలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, క్రీడాకారులు కూడా కూలీలే. వారు నిజంగానే కూలీలుగా మారారనుకుంటే పొరపాటే. ఎందుకంటే వారి ఫొటోలతో ఉపాధి హామీ యాప్లో కూలీలుగా నమోదు చేశారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, క్షేత్రస్థాయి సిబ్బంది వారి ఫోటోలను యాప్లో పెట్టి ఉపాధి పనులకు వస్తున్నట్లు హాజరు నమోదు చేసి వేతనాలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ కార్యదర్శుల మాదిరిగానే, ఇకపై నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో కూలీల హాజరును నిర్ధారించడానికి ఈ-కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం.. ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీలు రోజులో రెండుసార్లు తమ ఫోటోలను యాప్లో నమోదు చేయాలి. వీటిని సరిచూసిన తర్వాతే కేంద్రం వేతనాలు విడుదల చేస్తుంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఈ యాప్ను దుర్వినియోగం చేస్తూ సినీ, టీవీ నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల ఫోటోలను నమోదు చేస్తున్నారు. ఈ నకిలీ ఫోటోల అంశంపై కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ తనిఖీలు నిర్వహించగా.. పెద్ద ఎత్తున నకిలీ ఫోటోలు బయటపడ్డాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది.
ఈ-కేవైసీ విధానంలో ముందుగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీల ఫోటోలను NMMS యాప్లో నమోదు చేస్తారు. కూలీలు పనులకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలను, ముందుగా నమోదు చేసిన ఫోటోలతో సరిపోల్చి ఆమోదం తెలుపుతారు. ఈ ప్రక్రియలో కచ్చితత్వం ఉంటుంది. ఈ కొత్త విధానంపై పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ప్రక్రియను ఈ నెల 10వ తేదీ వరకు పూర్తి చేసి, ఆగస్టు 15 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానంతో ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెరుగుతుందని, నకిలీ హాజరుకు అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa