ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఖీ పండగ వేళ భారీగా గ్రీటింగ్స్, ఆఫర్స్.. కీలక సూచనలు చేసిన తెలంగాణ పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 09:57 PM

రాఖీ పండగ రానున్న వేళ.. తెలంగాణ పోలీసులు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్లు వేసే వలలో పడొద్దని.. ముందుగానే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా.. 'దొరికినంతా దోచుకో, దోచుకుందీ దాచుకో' అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్, సోషల్ మీడియా వాడకం పెరిగిపోతుండటంతో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నట్లు గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. సైబర్ నేరగాళ్లు కూడా రోజురోజుకూ కొత్త పంథాలో అకౌంట్లను కొల్లగొడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే లింక్‌లు షేర్ చేస్తూ.. వాటిని క్లిక్ చేయగానే డబ్బులు కట్ అయ్యేలా కుట్రలు చేస్తున్నారు.


ఈ క్రమంలోనే రాఖీ పౌర్ణమి (ఆగస్ట్ 9) సందర్భంగా సైబర్ నేరగాళ్లు వేసే ఉచ్చులో చిక్కుకోవద్దని తెలంగాణ పోలీసులు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. రాఖీ పండుగ స్పెషల్ ఆఫర్ పేరుతో సైబర్ కేటుగాళ్లు వల వేస్తారని చెప్పారు. లింక్‌లు క్లిక్ చేస్తే.. గిఫ్ట్ వస్తుందని యాడ్స్ ఇస్తారని పేర్కొన్నారు. తొందరపడి అలాంటి లింక్స్‌ను క్లిక్ చేయవద్దని చెప్పారు. గ్రీటింగ్స్, ఆఫర్స్ అంటూ మెసేజ్‌లు వస్తే.. వాటిని అస్సలు నమ్మొద్దని సూచించారు. సైబర్ నేరస్తులు వేసే వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. ఇలాంటి లింక్‌లు వస్తే.. వాటిని సోషల్ మీడియా అకౌంట్లలో అసలు షేర్ చేయవద్దని వెల్లడించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే.. ఫిర్యాదు చేసేందుకు వెంటనే 1930ను సంప్రదించాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.


సైబర్‌ నేరాలను అడ్డుకోవాలంటే.. ముందుగా వాటిపై అవగాహన ఉండాలని.. అలాంటప్పుడే సైబర్ క్రైమ్‌లను కట్టడి చేయవచ్చని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరం జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే మేల్కొని.. అది జరగకుండా నివారించాలని పేర్కొంటున్నారు.


మరోవైపు.. గతేడాది దేశవ్యాప్తంగా భారీగా సైబర్ నేరాలు జరిగినట్లు తాజాగా విడుదలైన రిపోర్ట్‌లో వెల్లడైంది. ఒక్క 2024 సంవత్సరంలోనే దేశంలో రూ.22,842 కోట్ల సైబర్ నేరాలు జరిగినట్లు డేటాలీడ్స్ అనే మీడియా, టెక్నాలజీ సంస్థ ఈ నివేదినకను విడుదల చేసింది. ఈ సంఖ్య 2023లో దేశవ్యాప్తంగా రూ.7,465 కోట్ల సైబర్ మోసాలు నమోదు కాగా.. 2022లో ఈ మొత్తం రూ.2,306 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa