తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వాటిని అమలు చేస్తోంది. వీటిలో రైతులకు కూడా అనేక పథకాలను అమలు చేస్తున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుండగా.. రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలతో వారికి ఆర్థిక భద్రత కల్పిస్తోంది. ఈ కార్యక్రమాలతో పాటు.. రైతులకు మరింత ఉపయోగపడేలా మరో రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలోని రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, టెక్నాలజీని తెలుసుకునేందుకు.. ప్రయోగాలు, ఆవిష్కరణల ప్రయోజనాలను పొందేందుకు వీలుగా.. ప్రతి జిల్లాలోనూ ఒక రైతు విజ్ఞాన కేంద్రాన్ని (ఆర్వీకే) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (అగ్రివర్సిటీ) ఆర్వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు) మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో పని చేసే శాస్త్రవేత్తల సంఖ్య కూడా చాలా తక్కువ. 15 జిల్లాల్లో వీరు అందుబాటులో కూడా లేరు. ఈ సమస్యను అధిగమించేందుకు, రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కొత్త కేంద్రాలు ఉపయోగపడనున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఈ రైతు విజ్ఞాన కేంద్రాలు అనేక అత్యాధునిక సేవలను రైతులకు అందించనున్నాయి. పంటల సాగులో డ్రోన్లు, యంత్రాలు, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), రోబోటిక్స్ వంటి సాంకేతిక సేవలను రైతులకు పరిచయం చేయడం. అంతే కాకుండా.. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియజేస్తారు. వీటితో పాటు.. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలను ఎలా మార్చుకోవాలో.. ఏ పద్ధతులు అనుసరించాలో వివరిస్తారు. నేరుగా వరి విత్తనాలు వేయడం, పత్తి పంటలో కలుపు మొక్కలను నివారించడం వంటి నూతన పద్ధతులను రైతులకు ప్రోత్సహించడం.
ప్రతి కేంద్రంలో ఆరుగురు శాస్త్రవేత్తలను నియమిస్తారు. వీరు రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందిస్తారు. ఈ కేంద్రాల్లో ఆధునిక ప్రయోగశాలలు, విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై రైతులకు శిక్షణ ఇస్తారు. కొత్త పరిశోధనలు, ప్రయోగాలకు కూడా అవకాశం కల్పిస్తారు. ఈ కేంద్రాలకు అనుబంధంగా.. స్టార్టప్లకు కూడా స్థలాు కేటాయించనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్వీకేలుగా మారుస్తారు. అదనంగా.. శాస్త్రవేత్తలు లేని మిగిలిన 15 జిల్లాల్లో కొత్త ఆర్వీకేలను ఏర్పాటు చేస్తారు. దీంతో రాష్ట్రంలోని 32 జిల్లాల్లోనూ రైతులకు విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ఈ కేంద్రాల ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని, రైతులు లాభసాటి వ్యవసాయం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రతిపాదనలు త్వరగా రూపొందించాలని ప్రభుత్వం అగ్రివర్సిటీని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa