ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 05:53 PM

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్రరూపం దాల్చింది. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అన్ని రకాల సినిమా షూటింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో టాలీవుడ్‌లో చిత్రీకరణలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి.గత కొంతకాలంగా సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని, వాటిని రోజువారీగా చెల్లించాలని ఫిలిం ఫెడరేషన్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనను నిర్మాతల మండలి అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కనీస వేతనాల కన్నా ఎక్కువే ఉన్నాయని, ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫిలిం ఛాంబర్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ల నిలిపివేతకు పిలుపునిచ్చింది. ఛాంబర్ అనుమతి లేకుండా స్టూడియోలు, అవుట్‌డోర్ యూనిట్లు ఎలాంటి సేవలు అందించవద్దని, నిబంధనల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు గురువారం కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నాయకులతో సమావేశం జరిగింది. అయినప్పటికీ, ఈ భేటీలో ఎలాంటి సయోధ్య కుదరలేదు. ఈ వివాదాన్ని పరిశ్రమ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ వీర శంకర్ తెలిపారు. అప్పటివరకు ఎలాంటి షూటింగ్‌లు జరపవద్దని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. దీంతో పలు పెద్ద సినిమాల చిత్రీకరణలకు ఆటంకం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa