మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి హత్య బెదిరింపు ఎదురైంది. ఇటీవలి కాలంలో ఆయనకు ఇలాంటి హెచ్చరిక రావడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను హైదరాబాద్లోనే ఉన్నానని, సాయంత్రంలోగా చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్ను కూడా పోలీసులకు అందజేశారు.ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత కొన్ని నెలలుగా రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరిట బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. జూన్ 29న ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునని పరిచయం చేసుకొని సాయంత్రంలోగా హతమారుస్తానని బెదిరించాడు. ఆ సమయంలో రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కాల్ను రికార్డ్ చేసిన ఆయన డీజీపీకి, మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.అంతకుముందు జూన్ 23న కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు తమను చంపే పనిలో ఉన్నాయని ఫోన్ చేసిన వ్యక్తులు హెచ్చరించారు. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు నిర్వహిస్తున్న 'ఆపరేషన్ కగర్' అనే మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్కు ప్రతిస్పందనగా ఈ బెదిరింపులు వస్తున్నాయని భావిస్తున్నారు.గత బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఎంపీ రఘునందన్ రావుకు సాయుధ సిబ్బందితో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ, తాజాగా మరోసారి బెదిరింపు కాల్ రావడం ఆయన మద్దతుదారుల్లో, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa