ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మానవ ప్రమేయం లేకుండా ఆటోమెటిక్గా మీటర్ రీడింగ్ను సేకరించే ఆధునిక విధానం వైపు అడుగులు వేస్తోంది. దీనికోసం కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ‘ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ (AMR) విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ నూతన విధానం విజయవంతమైతే.. భవిష్యత్తులో ఈ సాంకేతికతను విస్తరించే అవకాశం ఉంది.
ప్రస్తుతం పరిశ్రమలు, గృహ వినియోగదారుల మీటర్ రీడింగ్ను వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది స్వయంగా సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని సార్లు జాప్యం లేదా లోపాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీనికి పరిష్కారంగా, ఎన్పీడీసీఎల్ ఏఎంఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో, పరిశ్రమల్లోని మీటర్కు ఒక ప్రత్యేకమైన ఏఎంఆర్ పరికరం బిగిస్తారు. ఈ పరికరంలో ఉండే 4G సిమ్ ద్వారా మీటర్ రీడింగ్ వివరాలు ఎప్పటికప్పుడు వరంగల్లోని సెంట్రల్ సర్వర్కు చేరుతాయి.
విద్యుత్ సరఫరాలో ఏవైనా హెచ్చుతగ్గులు వచ్చినా, సరఫరా నిలిచిపోయినా వెంటనే సెంట్రల్ సర్వర్కు సమాచారం అందుతుంది. దీంతో అధికారులు సమస్యను త్వరగా గుర్తించి పరిష్కరించవచ్చు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 992 హెచ్టీ (హై-టెన్షన్) సర్వీసులు, 750 తక్కువ సామర్థ్యం గల పారిశ్రామిక సర్వీసులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 25 సర్వీసులకు ఈ AMR పరికరాలను అమర్చినట్లు ఎస్ఈ మేకల రమేష్ బాబు తెలిపారు. మిగతా సర్వీసులకు కూడా త్వరలో వీటిని బిగించనున్నారు.
ఈ కొత్త విధానం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మానవ ప్రమేయం లేకపోవడం వల్ల రీడింగ్లో తప్పులు, అక్రమాలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. రీడింగ్ సేకరించే ప్రక్రియ వేగవంతం అవుతుందని అంటున్నారు. ప్రతి రీడింగ్ ఖచ్చితంగా నమోదు అవుతుందని.. సకాలంలో బిల్లులు జారీ చేయడానికి వీలవుతుందన్నారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో గృహ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తే.. విద్యుత్ వినియోగ పర్యవేక్షణ, బిల్లింగ్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఉత్తర తెలంగాణ విద్యుత్ అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa