మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, దానిని అమలు చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీలోకి తీసుకున్నప్పుడు తాము అన్నదమ్ములిద్దరం ఉన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఆలస్యమైనా, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆయన డిమాండ్ చేశారు.
రాజగోపాల్ రెడ్డి, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పార్టీలో చేరినప్పుడు, ఇద్దరూ సమర్థులమని తెలిసే మంత్రి పదవి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. "ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య" అన్న రీతిలో పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటంలో తప్పేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే, అది తనకు జరిగిన అన్యాయంగా భావిస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు పదవి కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని, అందుకే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు కూడా మునుగోడునే ఎంచుకున్నానని తెలిపారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని, అవసరమైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సవాల్ చేసినట్లు ఇప్పుడు కూడా సవాల్ చేస్తానని హెచ్చరించారు.
తనకు మంత్రి పదవి ఇస్తే మునుగోడు ప్రజలకు మరింత మేలు జరుగుతుందని, అయితే పదవి కోసం ఎవరి కాళ్లూ పట్టుకోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా తనకు గౌరవం ఇవ్వాలని కోరారు. పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, మునుగోడు అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ పాలన ఉండాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa