తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పలు పార్టీలకు భారీ షాకిచ్చింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 13 పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఈమేరకు కేంద్రం ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. 13 పార్టీల గుర్తింపు రద్దు గురించి తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డికి సమాచారం అందించింది. ఈసీఐ గుర్తింపు రద్దు చేసిన వాటిల్లో పలు జిల్లాలకు చెందిన పార్టీలు ఉన్నాయి.
కేవలం తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా రెండు విడతల్లో కలిపి 810 రాజకీయ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. మొదటి లిస్ట్లో 334.. 2వ జాబితాలో 476 పార్టీల పేర్లను ప్రకటిస్తూ.. వాటి గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం ఎన్నికల సంఘం గుర్తింపు రద్దు చేసిన పార్టీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 44 పార్టీలున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొదటి జాబితాలో 13, రెండో లిస్ట్లో 9 మొత్తం 22 పార్టీలున్నాయి.
తెలంగాణలో మొదటి జాబితాలో రద్దు చేసిన పార్టీల జాబితాలో తెలంగాణ లోక్సత్తా పార్టీ, యువ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, యువ తెలంగాణ పార్టీ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, బహుజన సమాజ్పార్టీ(అంబేడ్కర్-ఫులే), జాతీయ మహిళా పార్టీ, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, జాగో పార్టీ, ఇండియన్ మైనార్టీస్ పొలిటికల్ పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ, తెలంగాణ ప్రజా సమితి( కిశోర్రావు, కిషన్), తెలంగాణ మైనార్టీస్ ఓబీసీ రాజ్యం, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తదితర పార్టీలున్నాయి. వీటన్నింటి గుర్తింపు రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా అనగా.. 2019 నుండి ఇప్పటి వరకు నిర్వహించిన ఒక్క ఎన్నికలో కూడా ఈ పార్టీలు పోటీ చేయలేదు. దీంతో వాటిని జాబితా నుండి తొలగించడానికి ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. నమోదైన రాజకీయ పార్టీలు.. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారైనా సరే.. ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలి. కానీ ఇప్పుడు తొలగించిన పార్టీలు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో ఈసీ వీటి గుర్తింపును రద్దు చేసింది.
కొన్ని పార్టీల విషయానికి వస్తే.. అవి నమోదు చేసుకునే సమయంలో ఇచ్చిన చిరునామాలలో ప్రస్తుతం అందుబాటులో లేవు. ఈసీ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకుని.. ఆ తర్వాతనే సదరు పార్టీల గుర్తింపు రద్దు చేశారు. అలానే గుర్తింపు రద్దైన పార్టీల్లో కొన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951తో పాటుగా.. ఆదాయపన్ను చట్టం-1961 నిబంధనలను ఉల్లంఘించాయి. దీంతో ఈసీ ఆ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ప్రకటన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa