భూమి లేని నిరుపేదలకు త్వరలో ప్రభుత్వం నుంచి భూముల పంపిణీ జరగనుంది. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. తెలంగాణ ప్రభుత్వం అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా.. జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలు కేవలం పాత సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. కొత్తగా భూములను గుర్తించి, అర్హులైన వారికి పంపిణీ చేసే బాధ్యతను కూడా తీసుకుంటాయి. రెవెన్యూ శాఖ ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
అసైన్డ్ భూముల సమస్యలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వ భూములను అసైన్డ్ చేసింది. అయితే.. కాలక్రమేణా ఈ భూములు అన్యాక్రాంతమయ్యాయి. చాలా చోట్ల అసైన్డ్ పట్టాలు ఉన్నా.. భూమి లేని పరిస్థితి ఏర్పడింది. మరికొందరికి భూమి ఉన్నా రికార్డుల్లో పేరు నమోదు కాలేదు. ఈ గందరగోళానికి పరిష్కారం చూపడానికి, తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీలకు జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, కలెక్టర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా భూములను అసైన్డ్ చేసి.. దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వాటికి హక్కులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ పేరుమీదా ఆ భూమి పట్టా లేకుండా సాగు చేసుకుంటున్న వారికి శుభవార్తే అని చెప్పాలి. ఇక పట్టా పాస్ బుక్ వస్తే.. రైతు భరోసా, రైతు బీమా వంటి వాటికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
భూముల పంపిణీ..
ఈ కొత్త కమిటీలు ప్రభుత్వ మిగులు భూములను గుర్తించి.. అర్హులైన నిరుపేదలకు కేటాయించే విధానాన్ని పారదర్శకంగా అమలు చేయనున్నాయి. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం –1977 ఉన్నప్పటికీ, చాలా భూములు అనధికారికంగా ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కమిటీలను రద్దు చేసి.. ఆ అధికారాలను కలెక్టర్లకు ఇచ్చింది.
కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు కొత్త కమిటీల ద్వారా ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణలో దాదాపు 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. పదేళ్ల క్రితం అసైన్డ్ చేసిన భూములపై కూడా యజమాన్య హక్కులు కల్పించే దిశగా ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళలో అనుసరిస్తున్న విధానాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa