ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ రైల్వే స్టేషన్ను మూసివేసేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ప్రయాణికుల ఆదరణ తగ్గుతోందని పేర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి. సునీత ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాదాపు 77 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్టేషన్పై ఆధారపడి సుమారు 15 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. నాగులవంచ, పాతర్లపాడు, సీతంపేట, చిన్నమండవ, రామాపురం వంటి గ్రామాల ప్రజలకు ఇది అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు.
సమస్యకు అసలు కారణం..
నాగులవంచ స్టేషన్లో గత కొంతకాలంగా టికెట్లు విక్రయించడం లేదు. మొదట మరమ్మతుల పేరుతో టికెట్ కౌంటర్ మూసివేశారు. ఆ తర్వాత.. అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా టికెట్లు ఇవ్వడం మానేశాడు. దీంతో రైలులో ప్రయాణించాలనుకునేవారు టికెట్లు లేకుండా ఎక్కడం వల్ల తనిఖీలలో ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల వివరణ..
మధిర నియోజకవర్గం స్వేరోస్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. రైల్వే అధికారులు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ను తిరిగి పునరుద్ధరించాలని, ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలని కోరారు. గతంలో ఈ స్టేషన్ అభివృద్ధి కోసం స్థానికులు అనేకసార్లు అప్పటి ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతి పత్రాలు సమర్పించారు.
మూడో లైన్ ఏర్పాటుతో స్టేషన్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి మూసివేత నిర్ణయం తీవ్ర నిరాశ కలిగించింది. ఈ నిర్ణయం రైల్వే అధికారుల విధానాలపై అనుమానాలను పెంచుతోంది. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa