ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో యూరియా కొరత ఎందుకు? కేంద్రం ఇచ్చినా కొరత ఎట్లా? బీజేపీ నేత రాంచందర్ రావు ప్రశ్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 14, 2025, 03:00 PM

తెలంగాణలో యూరియా కొరతపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో యూరియా సమస్య లేకపోగా, తెలంగాణలో మాత్రమే ఈ కొరత ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నించారు. కేంద్రం గతంలోకన్నా ఎక్కువగా యూరియా కేటాయించిందని, ఇంకా కొంత మొత్తమే రావాల్సి ఉందని పేర్కొన్నారు.
రాంచందర్ రావు తీవ్రంగా స్పందిస్తూ, "యూరియా ఏమవుతుంది? ఎవరు తింటున్నారు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ నేతల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ కొరత ఉద్దేశపూర్వకంగానే సృష్టించబడుతోందని ఆరోపించారు. రైతులను ఇబ్బందుల పాలుచేసేందుకు గాను కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
ఫెర్టిలైజర్ షాపులకు సరఫరా వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులే డైవర్ట్ చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఇది సహజమైన కొరత కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పరచిన కృత్రిమ కొరత మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ సమస్యపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు తెరపైకి వచ్చి డిబేట్ చేయాలంటూ రాంచందర్ రావు సవాల్ విసిరారు. రైతులను మభ్యపెట్టి రాజకీయం చేయడం తగదన్నారు. యూరియా కొరతపై నిజాయితీగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa