ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు భరోసాతో పాటు.. అదనంగా ఎకరాకు రూ.4 వేలు అకౌంట్లోకి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 05:23 PM

రైతులకు పెట్టుబడి సాయం, పంట నష్టానికి పరిహారం, బీమా వంటి పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ.. రైతులు పంటలను తెగుళ్లు, చీడపీడల నుంచి రక్షించుకోవడానికి ఎక్కువగా రసాయన ఎరువులను వాడుతున్నారు. ఈ రసాయనాల వల్ల నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, మానవ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా.. ప్రభుత్వాలు రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా.. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ. 4,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. వీటితో పాటు.. తెలంగాణ రైతులకు రైతు భరోసా, రైతు బీమాా లాంటివి కూడా వర్తించనున్నాయి. ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని తెలంగాణలో జిల్లాల వారీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాలో క్లస్టర్లను ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్‌లో రెండు నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేస్తున్నారు. ఒక్కో క్లస్టర్‌లో కనీసం 125 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులకు సహాయం చేయడానికి, ఒక్కో క్లస్టర్ నుంచి ఇద్దరు రైతులను 'కృషి సఖీలు' లేదా 'క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్'గా ఎంపిక చేస్తున్నారు. వీరికి నెలకు రూ. 5,000 వేతనం ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి మాస్టర్ ట్రైనీలు ఉంటారు. ఈ సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


 ఈ పథకం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది, సాగు ఖర్చులు కూడా తగ్గుతాయి. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం జాతీయ బ్రాండ్ కల్పించి, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది. జిల్లాల్లోని పరిశోధనా కేంద్రాలలో నమూనా క్షేత్రాలు ఏర్పాటు చేసి, రైతులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తారు. హన్మకొండ జిల్లాలో కూడా ఈ పథకం వేగవంతంగా అమలవుతోంది. జిల్లాలోని పలు గ్రామాలలో క్లస్టర్లను ఏర్పాటు చేసి, రైతులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.


వ్యవసాయానికి అవసరమైన బయో ఎరువులు, జీవ రసాయనాలు అందుబాటులో ఉంచడానికి ప్రతి క్లస్టర్‌కు మూడు బయో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తుంది. ఈ కేంద్రాలను రైతు సంఘాలు లేదా సహకార సంఘాలు నిర్వహించవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 49 బయో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం వల్ల రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.


ఆదిలాబాద్ జిల్లాలో 20 క్లస్టర్లను గుర్తించారు. ఈ క్లస్టర్లలో 2,500 ఎకరాల భూమిలో 2,500 మంది రైతులు సాగు పనులు చేపట్టనున్నారు. పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలో 15 క్లస్టర్ల ద్వారా 1,875 ఎకరాల్లో 1,875 మంది రైతులు పంటలు పండించనున్నారు. అదేవిధంగా.. కుమురంభీం జిల్లాలో అత్యధికంగా 24 క్లస్టర్లలో, 3,000 ఎకరాల్లో 3,000 మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. నిర్మల్ జిల్లాలో కూడా 15 క్లస్టర్లను ఏర్పాటు చేసి, 1,875 ఎకరాలలో 1,875 మంది రైతులకు ఈ అవకాశం కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa