ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు శుభవార్త... ఇక ఆ రైళ్లన్నీ ఏసీ రైళ్లుగా మార్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 08:42 PM

హైదరాబాద్ నగరంలో ప్రయాణ సమయాన్ని తగ్గించి.. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) రైళ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే.. బెంగళూరు, చెన్నై వంటి నగరాలు తమ సబర్బన్ రైలు సర్వీసులను ఆధునీకరిస్తున్నప్పటికీ.. హైదరాబాద్‌లో మాత్రం ఎంఎంటీఎస్ సేవలు సాంకేతిక కారణాల వల్ల, సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోతున్నాయి.


ప్రస్తుతం రోజుకు లక్షన్నర మంది ప్రయాణించే ఈ రైళ్లలో ఇప్పుడు కేవలం 50 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. రాను రాను ఈ సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. ఏసీ సౌకర్యం, వేగవంతమైన ప్రయాణం కోసం చాలామంది ప్రజలు మెట్రో రైళ్లను ఎంచుకుంటున్నారు. మెట్రోలో మొత్తం ఏసీ కోచ్‌లు ఉండటం.. వేసవి సమయంలో ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉండటం కూడా కారణం కావొచ్చు. ఏదేమైనా ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గుతున్నారనేది వాస్తవం.


దాదాపు.. ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభమై 22 సంవత్సరాలు గడిచినా.. ఇప్పటికీ ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టలేదు. ఈ ప్రతిపాదనలు గత ఏడేళ్లుగా కాగితాలకే పరిమితమయ్యాయి. మేడ్చల్, బొల్లారం, ఘట్‌కేసర్, ఫలక్‌నుమా వంటి మెట్రో సౌకర్యం లేని మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. రోడ్డు మార్గంలో రెండు గంటలు పట్టే ప్రయాణాన్ని ఎంఎంటీఎస్ ద్వారా కేవలం 45 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ రైళ్లకు ఏసీ కోచ్‌లను జోడిస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎంఎంటీఎస్ రైళ్లను ఏసీ కోచ్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం ప్రయాణికులకు సంతోషాన్ని కలిగించింది.


హైటెక్స్‌లో జరిగిన క్రెడాయ్ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగర అభివృద్ధిపై అనేక అంశాలు వెల్లడించారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాలతో పాటు నిర్మాణ రంగంలోనూ అగ్రగామిగా ఉందని, ఈ రంగం అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇస్తుందని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని చెప్పారు.


ఎంఎంటీఎస్ రైళ్లను త్వరలో ఏసీ రైళ్లుగా మారుస్తామని, సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులను కూడా వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌లో రూ. 720 కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని, హైదరాబాద్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాల వల్ల నగరంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa