నల్లగొండ జిల్లా కోర్టు ఈ మధ్య సంచలన తీర్పులు వెల్లడిస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం అత్యాచారం కేసులో ఒకరికి ఉరిశిక్ష విధించిన కోర్టు... తాజాగా మరోసారి మరో అత్యాచారం కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి ఏకంగా 51 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటుగా 85 వేల రూపాయల జరిమానాతో పాటుగా బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం అందించాలని నల్లగొండ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ ఎస్టీ కోర్ట్ జడ్జి రోజా రమణి ఈ కేసులో మహ్మద్ ఖయ్యుమ్ అనే వ్యక్తిని నిందితుడిగా తేల్చి.. 51 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఆ వివరాలు..
కేసు వివరాలకు వస్తే.. నాలుగేళ్ల క్రితం అనగా 2021, నవంబర్ 3న బాధిత బాలిక.. స్కూల్ అయిపోయిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ప్రయాణం అయ్యింది. ఈ క్రమంలో నిందితుడు షేక్ మహ్మద్ ఖయ్యూం బాలికను బలవంతంగా బండి మీద ఎక్కించుకుని.. పట్టణ శివారులోని ఒక పాడుబడ్డ ఇంటికి తసీుకెళ్లాడు. ఆపై బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జరిగిన దారుణం గురించి బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. డిసెంబర్ 5న నిందితుడి మీద డిసెంబర్ 5న తిప్పర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా.. తాజాగా తీర్పు వెల్లడించారు.
ఈ కేసులో పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు.. అలానే బాధిత బాలిక(16) ఎస్టీ సామాజిక వర్గానికి చెందడంతో.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మరో 20 ఏళ్లు జైలు శిక్ష విధించారు. దీనితో పాటుగా కిడ్నాప్ కేసుకు గాను 10 సంవత్సరాలు ఇలా మొత్తం 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. దీంతోపాటుగా నిందితుడికి 85 వేల రూపాయల జరిమానాతో పాటు.. 7 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ప్రకటించారు. ఈ కేసు తెలంగాణలో పోక్సో చట్టం కింద అత్యధిక కాలం శిక్ష విధించిన కేసులలో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశం ఉందంటున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి అధ్వర్యంలో బలమైన సాక్ష్యాధారాలను దాఖలు చేశారు. 20 మందికి పైగా సాక్షులను కోర్టు ముందు హజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. నిందితుడి నేరం చాలా దారుణమైందని.. మైనర్ బాలికపై దాడి చేయడమే కాక.. ఆపై బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని తెలిపారు. ఇలాంటి నేరస్తులకు కఠిన శిక్ష తప్ప వేరే మార్గం లేదని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa