హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం ప్రతి సంవత్సరం అత్యంత ఉత్సాహభరితంగా.. అద్భుతమైన శోభాయాత్రల మధ్య జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా నగరంలోని ప్రతి వీధి, కాలనీ, బస్తీలో విభిన్న ఆకృతులలో.. రంగురంగుల అలంకరణలతో గణపతి విగ్రహాలు ప్రతిష్టిస్తారు. పండుగ రోజులంతా భక్తులు ఘనంగా పూజలు, హారతులు నిర్వహించి చివరి రోజు నిమజ్జనోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
హైదరాబాద్లో ప్రధాన నిమజ్జన ప్రదేశం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్. ఇక్కడికి మాత్రమే కాకుండా, నగరంలోని చిన్న పెద్ద చెరువులు, సరస్సుల్లో కూడా విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్, బలాపూర్ గణేష్, దాదాపు 50 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాలు ప్రజల్లో విశేష ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీ (శనివారం) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుంది. అయితే ఈ తేదీకి ఇచ్చిన సెలవు స్థానంలో అక్టోబర్ 11వ తేదీ రెండో శనివారం పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 5వ తేదీన మిలాద్ ఉన నబీ సందర్భంగా పలు పాఠశాలలు, కాలేజీలు సెలవు ప్రకటించాయి. సెప్టెంబర్ 7న ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఇక దసరా సందర్భంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులను ప్రకటించారు.
ఇక గణేశ్ నిమజ్జనానికి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసింది. హుస్సేన్సాగర్, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ మార్గాల్లో భారీ క్రేన్లు, లైటింగ్, భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
నిమజ్జన ప్రదేశాలకు నగరంతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. వారి సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. కాచిగూడ, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ముషీరాబాద్, మెహిదీపట్నం, లింగంపల్లి, రాజేంద్రనగర్ వంటి ప్రధాన డిపోల నుండి అదనపు సర్వీసులు ప్రారంభించబడతాయి. వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా ప్రత్యేక మెకానిక్లు, డ్రైవర్లను కూడా నియమించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa