తెలంగాణ ఆర్టీసీ తరచుగా ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్–విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి బస్సులను బట్టి 30 శాతం వరకు రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి నడిచే లహరి ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 10 శాతం ప్రత్యేక డిస్కౌంట్ను ఆర్టీసీ అందిస్తోంది. ఈ సమాచారం గురువారం అధికారిక వేదికల ద్వారా ప్రకటించబడింది. దీని ద్వారా తిరుపతి వెళ్లే భక్తులకు ప్రయాణ ఖర్చు కొంత తగ్గనుంది. ప్రత్యేకించి పండుగల సీజన్లో, వారాంతాల్లో ఈ రాయితీ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రయాణికులు ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tgsrtcbus.in
ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. దీనితో పాటు డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహకంగా కొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే కాకుండా, తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరుకునేలా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం. భక్తులు, సాధారణ ప్రయాణికులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి అని తెలిపారు.
తిరుపతి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక కేంద్రమైనందున, ప్రతి రోజు వేలాదిమంది భక్తులు హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం.. భక్తులకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, సంస్థ సేవలపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.
హైదరాబాద్లోని బెల్ బస్ స్టేషన్ నుంచి తిరుపతి వరకు నడిచే లహరీ ఏసీ స్లీపర్ బస్సులో మొత్తం 26 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో టికెట్ ధర రూ.1591గా నిర్ణయించబడింది. అయితే తాజాగా ప్రకటించిన 10 శాతం డిస్కౌంట్ కారణంగా ప్రయాణికులు ఒక్క టికెట్కు సుమారు రూ.1400 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ చేసేటప్పుడు కొన్ని సర్వీస్ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తారు. వాటిని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa