ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజు యాదగిరిగుట్ట దర్శనాలు అన్నీ బంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 07:18 PM

భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈసారి చంద్రగ్రహణం కారణంగా ఒక రోజు పాటు మూతపడనుంది. సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 8న ఉదయం 1:26 గంటల వరకు కొనసాగే ఈ చంద్రగ్రహణం ప్రభావం దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగుతుంది. ఈ సమయం మొత్తం ఆలయం మూసివేయనున్నట్లు దేవస్థాన అధికారులు స్పష్టం చేశారు.


గ్రహణానికి ముందు రోజున.. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఆలయంలోని నిత్య పూజలు, హోమాలు, కైంకర్యాలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ద్వారాలు తాళాలు వేసి మూసివేయనున్నారు.


తర్వాతి రోజు ఉదయం శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించి.. భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


యాదగిరిగుట్ట చరిత్ర ఎంతో విశిష్టమైనది. యాద మహర్షి అనే ముని తపస్సు చేసి లక్ష్మీనరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్నారు. తొలుత స్వామివారు ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యారు. ముని భయాందోళన చెందగా, శాంత స్వరూపంలో దర్శనమివ్వాలని కోరగా, లక్ష్మీదేవితో కలసి మంగళరూపంలో దర్శనమిచ్చారు. అనంతరం ముని అభిలాష మేరకు శాశ్వతంగా కొండపై కొలువై కూర్చున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే.. యాదగిరిగుట్టలో స్వామివారు జ్వాల, గండబేరుండ, యోగ, నంద, నరసింహ రూపాల్లో కూడా ప్రత్యక్షమై భక్తులకు ఆశీస్సులు అందించారని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం నరసింహ క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.


హైదరాబాద్‌ నగరం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండటంతో.. ప్రతి రోజు వేలాదిమంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ప్రతి పౌర్ణమి, ప్రత్యేకంగా నరసింహ జయంతి రోజున.. లక్షలాది భక్తులు ఇక్కడికి చేరుతారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘యాదాద్రి దేవస్థాన అభివృద్ధి ప్రాజెక్ట్ అమలు చేస్తోంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన యాదగిరిగుట్టలో చంద్రగ్రహణం సమయంలో ఈ తాత్కాలిక మూత అనివార్యమని పండితులు తెలిపారు. గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పూజలు ఆపడం శాస్త్రసమ్మతమని పేర్కొన్నారు. కనుక భక్తులు ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని తమ యాత్రా ప్రణాళికలను మార్చుకోవాలని సూచనలందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa