దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం జరిగిన వినియోగదారుల సంప్రదింపుల సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా.. కాజీపేట నుంచి బల్లార్షా, కాజీపేట నుంచి విజయవాడ మధ్య ట్రిప్లింగ్ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి అవుతాయని తెలిపారు. ఇప్పటికే ఉన్న ఒక రైల్వే ట్రాక్కు రెండు అదనపు ట్రాక్లను జోడించి మొత్తం మూడు ట్రాక్లుగా మార్చడాన్ని ట్రిప్లింగ్ అంటారు. కాజీపేట నుంచి ఈ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి చేస్తామని రైల్వే జనరల్ మేనేజర్ హామీ ఇచ్చారు.
అదేవిధంగా విజయవాడ–గూడూరు మధ్య ట్రిప్లింగ్ పనులు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రైళ్ల రద్దీ తగ్గి, ప్రయాణ సమయాలు తగ్గి, సరుకు రవాణా కూడా మరింత సులభతరం కానున్నాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 100 శాతం విద్యుద్ధీకరణ పూర్తి చేశామని రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు.
రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ ప్రణాళికలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 119 స్టేషన్లు పునరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద కల్పించబడే సౌకర్యాల విషయానికి వస్తే.. ఆధునిక వేటింగ్ హాల్స్ – సౌకర్యవంతమైన కూర్చొనివ్వడాలు, చల్లని వాతావరణం, విశ్రాంతి గదులు ఉంటాయి. వీటితో పాటు.. డిజిటల్ డిస్ప్లే బోర్డులు – రైళ్ల రాకపోకలకు సంబంధించిన రియల్ టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుంది. భద్రతా చర్యలు మరింత బలపడేలా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. స్కై వాక్స్ , ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల ద్వారా ప్లాట్ఫామ్ల మధ్య రద్దీ తగ్గించే విధంగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ మార్పులు అమలు అయ్యాక స్టేషన్లు కేవలం ప్రయాణ సౌకర్యాలకే కాకుండా వాణిజ్య అవకాశాలకూ కేంద్రాలుగా మారనున్నాయి. చిన్న షాపులు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ సదుపాయాలు, డిజిటల్ సౌకర్యాలు ప్రయాణికులకు నూతన అనుభవాన్ని కలిగించనున్నాయి. ప్రస్తుతం 78 స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు అమర్చగా, మరో 453 స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
దీంతో రైల్వే ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి పార్లమెంట్ సభ్యులు రైల్వే అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, పల్లెప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపరచడం, పాసింజర్ సౌకర్యాలను పెంపొందించడం వంటి అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa