గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, రైతులకు కూడా ప్రత్యక్ష లాభం చేకూరుతోంది. కరీంనగర్ జిల్లా డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్ రఘువరన్ మాట్లాడుతూ.. అవసరమున్న రైతులు సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకుంటే పథక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ఈ పథకాలకు వంద శాతం రాయితీ కల్పిస్తామన్నారు.
జిల్లాలోని 385 పంచాయతీల్లో పశువుల పాకలు, గొర్రెలు-మేకల షెడ్లు, కోళ్ల పెంపకం, అజోలా సాగు, వర్మీ కంపోస్టు గుంతలు, ఇంకుడు గుంతలు, చెక్డ్యాంల నిర్మాణం వంటి అనేక పనులకు లక్ష్యాలు నిర్ధేశించారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కోళ్ల పెంపకం కోసం వంద షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా 34 పనులు కొనసాగుతున్నాయి. ఇంకుడు గుంతలు 2,000 నిర్మాణ లక్ష్యంలో 1,230 పూర్తయ్యాయి. అలాగే.. వర్మీ కంపోస్టు గుంతలు 201లో 112 నిర్మాణ దశలో ఉన్నాయి. పశువుల షెడ్లు 864 లక్ష్యంలో 552 పూర్తయ్యాయి. గొర్రెల షెడ్లు 119లో 74 నిర్మాణ దశలో ఉండగా, అజోలా పెంపకం లక్ష్యం 659 ఉండగా 384 యూనిట్లు ఇప్పటికే రైతుల వద్ద అమలులోకి వచ్చాయి. భూగర్భ జలాల పెంపు కోసం చెక్డ్యాంలు 20 నిర్మించాలని నిర్ణయించగా.. వాటిలో 17 ఇప్పటికే పూర్తి అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘ఊరూరా పనుల జాతర’ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ఈ పనులను వేగవంతం చేసింది. దీనివల్ల స్థానిక కార్మికులకు ఉపాధి లభించడం మాత్రమే కాదు.. రైతుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. యూనిట్ వారీ వివరాలు.. పశువుల పాకలకు సంబంధించి.. ఒక్క యూనిట్ ధర రూ.98 వేలుగా నిర్ణయించారు. కనీసం మూడు పశువులు ఉన్న రైతులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.
గొర్రెలు, మేకల షెడ్లకు సంబంధించి.. ఒక్క యూనిట్ రూ.98 వేలు. కనీసం 10 పశువులు ఉన్న వారికి మంజూరు. కోళ్ల పెంపకం షెడ్లకు సంబంధించి.. ఒక్క యూనిట్ రూ.25 వేలు. రైతులు వంద కోడి పిల్లలను పెంచుకోవాలి. అదనంగా రూ.3 లక్షల వరకు మద్దతు అందజేస్తారు. అజోల్లా పెంపకంలో.. ఒక్క యూనిట్ రూ.20 వేలు. ఇది కేవలం రైతులకు మాత్రమే అందజేయబడుతుంది. వర్మీ కంపోస్టు గుంతల విషయంలో.. ఒక్క యూనిట్ రూ.15 వేలు. వ్యక్తిగతం లేదా సామూహికంగా నిర్మించుకోవచ్చు. ఇంకుడు గుంతల విషయానికి వస్తే.. ఒక్క యూనిట్ రూ.6,500 చొప్పున చెల్లిస్తారు.
ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు 100 రోజుల ఉపాధి భరోసా లభిస్తుండగా.. రైతులు తక్కువ ఖర్చుతో పశుసంవర్ధక, కోళ్ల పెంపకం, అజోలా సాగు, వర్మీ కంపోస్టు వంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇవి రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం తెచ్చి పెట్టడమే కాకుండా.. గ్రామాల్లో స్థిరమైన జీవన విధానం ఏర్పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చెక్డ్యాంల నిర్మాణం భూగర్భ జలాలను భద్రపరచి సాగుకు సహకరిస్తోంది. ఇలా.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కేవలం పనులు మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన అభివృద్ధి దిశగా మార్గదర్శిగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa