తెలంగాణలో వాతావరణ శాఖ కొత్త అంచనాలు విడుదల చేసింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం క్రమంగా పెరుగుతుందని.. రేపటి నుంచి వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచించారు. ప్రత్యేకించి మంగళ, బుధ వారాల్లో తుఫాన్ ప్రభావం మరింతగా ఉండే అవకాశముందని తెలిపారు.
రాబోయే 12 గంటల్లో.. హైదరాబాద్తో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో గాలివానలతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, రాత్రిపూట బయటకు వెళ్ళేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 8 నుంచి 9 వరకు వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున, తక్కువ ఎత్తులోని ప్రాంతాల్లో నీరు నిలిచిపోవచ్చని.. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇప్పటికే మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీలు కాల్వలు శుభ్రం చేయడం, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక దళాలను సిద్ధం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం, రక్షణ చర్యలు తక్షణమే అందేలా వ్యవస్థలు సిద్ధమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
పొలాల్లో పనులు చేసే రైతులు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున.. గాలివాన సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందరాదని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, విద్యుత్ పరికరాల వద్ద నిలబడకపోవడం వంటి సూచనలు జారీ చేశారు. నదులు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. మోటారు వాహనదారులు ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా బయటకు పంపరాదని.. పాఠశాలలు అవసరమైతే సెలవులు ఇవ్వాలని సూచనలు వెలువడుతున్నాయి. ఈ వర్షాలు రాష్ట్రానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ.. సహజ విపత్తులను ఎదుర్కొనేందుకు అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి కుటుంబం తాగునీరు, ఆహారం, టార్చ్లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa