ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు పూర్తిగా చెక్.. రూ.8,858 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 07:23 PM

హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేసారి పలు ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మొత్తం రూ.8,858 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులు, నగరానికి మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలకు కూడా తాగునీటి సరఫరా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. మొత్తం రూ.7,360 కోట్లతో చేపట్టిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌లో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు.


ఇందులో 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల ద్వారా ముసీ నదికి వదిలి పునరుద్ధరిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మార్గంలో ఉన్న ఏడు మధ్యంతర చెరువులు కూడా నిండేలా చర్యలు తీసుకుంటున్నారు. హైబ్రిడ్ అన్యుటీ మోడల్‌లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


అంతే కాకుండా.. రూ.1,200 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (ఫేజ్-2)ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ జిహెచ్ఎంసీ పరిధి, సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరా అందించనుంది. మొత్తం 71 రిజర్వాయర్లు నిర్మించగా.. అందులో 15 రిజర్వాయర్లను ఈసారి ప్రారంభిస్తున్నారు.


సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పురం, పటాన్‌చెరు, బోలారం ప్రాంతాల్లో 14 మండలాలకు చెందిన 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా తాగునీరు అందుతుంది.


కోకాపేట్ లేఅవుట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్..


అదనంగా.. కోకాపేట్ లేఅవుట్, నీయోపోలిస్, ఎస్ఈజడ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. మలినజల శుద్ధి కోసం రూ.298 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్ట్‌కు సీఎం పునాది వేయనున్నారు. ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. దీని ద్వారా సుమారు 13 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది.


నగరం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించడమే కాకుండా.. చెరువులను పునరుద్ధరించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మూడు ప్రాజెక్టులకు కలిపి రూ.8,858 కోట్ల వ్యయం కానుంది. ఇక గ్రామీణ ప్రాంతంతో ఎక్కడా తాగునీటి కష్టాలు లేవని.. ఒక వేళ ఏదైనా ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు. 18005994007 టోల్ ఫ్రీ నంబర్‌ను ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa