ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మాకు ఇందిరమ్మ ఇళ్లు వద్దు’.. స్వతహాగా వదిలేసుకుంటున్న లబ్ధిదారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 08:25 PM

తెలంగాణలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇళ్లు మంజూరైనప్పటికీ.. లబ్ధిదారుల్లో చాలామంది నిర్మాణాలు ప్రారంభించడానికి వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఒకరిద్దరు అన్నదమ్ముళ్లు ఉంటే.. ఎవరికో ఒకరికి మంజూరు కావడం.. వంటి పలు కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది.


సిద్దిపేట, దుబ్బాక వంటి నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరైనప్పటికీ.. పలువురు లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇందులో ముఖ్యంగా కొంతమంది లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం లేదు. కుటుంబ పెద్ద మరణించడం వంటి విషాద ఘటనల వల్ల ఏడాది వరకు నిర్మాణాలు చేపట్టడానికి వెనుకాడుతున్నారు. పునాది తీయడానికి కూడా డబ్బులు లేకపోవడం, నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి సమకూర్చుకోలేకపోవడం వంటివి ముఖ్య కారణాలుగా ఉన్నాయి.


 సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో మంజూరైన 2,658 ఇళ్లలో 1,008 మంది లబ్ధిదారులు ఇంకా పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రభుత్వం వారి ఇళ్లను రద్దు చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయానికి చాలామంది లబ్ధిదారులు లిఖితపూర్వకంగా తమ సమ్మతిని కూడా తెలియజేస్తున్నారు. రద్దు అయిన వారి స్థానంలో కొత్త అర్హులను గుర్తించడానికి అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు.


ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా నిధులు విడుదల చేయనుంది. నిర్మాణ పనులు పురోగతిని బట్టి ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేయబడతాయి. పునాది, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి విడత.. స్లాబ్ లెవల్ వరకు గోడలు కట్టిన తర్వాత రెండో విడత. స్లాబ్ వేసిన తర్వాత మూడో విడత.. ఇల్లు పూర్తిగా పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధమైన తర్వాత నాలుగో విడత డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు. ఈ నాలుగు విడతలుగా నిధులు విడుదల చేయడం ద్వారా.. నిర్మాణ పనులలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. చాలామంది లబ్ధిదారులకు మొదటి విడతలో పునాది వేయడానికి కూడా డబ్బులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది.


ప్రస్తుతం చాలామంది లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారి సమస్యలను అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలు చూపించాలి. పెట్టుబడి లేని వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించడం లేదా చిన్న చిన్న పనులకు ప్రభుత్వం తరపున సహాయం అందించడం వంటి చర్యలు చేపడితే మంచిది. ఇదిలా ఉండగా.. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే వారు.. తమ ఫొటోలను ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేసే వెసులుబాటును కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa