వరంగల్ నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. ఈ వరదలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. బస్సుల్లో ఉన్న ప్రయాణికులను పోలీసులు, స్థానికులు కలిసి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం భారీ వర్షం వల్ల వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా నీటితో నిండిపోయింది. ఈ మార్గంలో వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు, వరద నీటి లోతును అంచనా వేయలేక మధ్యలో చిక్కుకుపోయాయి. బస్సులు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో లోపల ఉన్న సుమారు వంద మంది ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.
స్థానికులు వెంటనే మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సులు కరీంనగర్ జిల్లా అన్నారం, మహబూబాబాద్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఆ మార్గాన్ని వెంటనే మూసివేశారు. ఇతర వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఈ అండర్ బ్రిడ్జి కింద తరచుగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇక దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa