సాధారణంగా మహిళలు మల్లెపూలను ఎంతో ఇష్టంగా తలలో పెట్టుకుంటారు. ఈ ఇష్టమే ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్కు లక్ష రూపాయల జరిమానా తెచ్చిపెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆమె తన వెంట తీసుకెళ్లిన కొద్దిపాటి మల్లెపూల కారణంగా అక్కడి విమానాశ్రయ అధికారులు ఏకంగా రూ. 1.14 లక్షల జరిమానా విధించారు. ఈ ఊహించని ఘటనతో నవ్య ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.ఇటీవల విక్టోరియా మలయాళీ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో దాదాపు 15 సెంటీమీటర్ల పొడవున్న మల్లెపూల దండను గుర్తించారు. ఆస్ట్రేలియాలో జీవభద్రత (బయోసెక్యూరిటీ) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దేశంలోని వ్యవసాయం, పర్యావరణాన్ని కాపాడేందుకు విదేశాల నుంచి తాజా పువ్వులు, మొక్కలు, విత్తనాలు వంటి వాటిని తీసుకురావడంపై పూర్తి నిషేధం ఉంది.ఈ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ అధికారులు నవ్యా నాయర్కు 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 1.14 లక్షలు) జరిమానా విధించారు. ఈ విషయాన్ని మెల్బోర్న్లో జరిగిన ఓ కార్యక్రమంలో నవ్య స్వయంగా వెల్లడించారు.అయితే ఈ ఘటనను ఆమె చాలా సరదాగా తీసుకున్నారు. జరిమానా చెల్లించిన తర్వాత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. సంప్రదాయ కేరళ చీరలో తలలో మల్లెపూలు పెట్టుకొని విమానాశ్రయంలో నడుస్తున్న దృశ్యాలను పంచుకుంటూ "ఫైన్ పడటానికి ముందు విజువల్స్" అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. రెండు దశాబ్దాలుగా మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్న నవ్య 2001లో 'ఇష్టం'తో అరంగేట్రం చేశారు. 'మజతుల్లిక్కిలుక్కం', ‘కుంజిక్కూనన్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa