హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సోమవారం గండిపేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కజ.7,360 కోట్ల వ్యయంతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ (ఫేజ్-2, 3) పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడమే కాకుండా, మూసీ నదిని శుద్ధి చేసి ప్రజలకు మళ్లీ జీవం పోసే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నాం” అని తెలిపారు.
సీఎం తన ప్రసంగంలో నగర చరిత్రను స్మరించుకున్నారు. 1908లో వచ్చిన ఘోర వరదల తర్వాత నిజాం పాలకులు, ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారని గుర్తు చేశారు. పీజేఆర్ పోరాటంతోనే 1965లో మంజీరా నది జలాలను నగరానికి తీసుకువచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించారన్నారు. అనంతరం 2002లో కృష్ణా జలాలను తరలించేందుకు పథకం అమలులోకి వచ్చిందని వివరించారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కృష్ణా, గోదావరి జలాలను నగరానికి అందించే ప్రాజెక్టులు అమలు చేశారన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, మూసీ నది కాలుష్యం అక్కడి ప్రజలకు విషమై మారిందని సీఎం పేర్కొన్నారు.
మూసీ నీటివల్ల పశువులు, మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. పుట్టబోయే శిశువులు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఈ సమస్యను నిర్మూలించడం మా ప్రభుత్వం కర్తవ్యం
ప్రాజెక్ట్ ద్వారా 20 టీఎంసీల గోదావరి నీళ్లు, వాటిలో 15–16 టీఎంసీలు హైదరాబాద్కు తాగునీటిగా.. మిగిలినవి చెరువుల నింపుదలకు, మూసీ ప్రక్షాళనకు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి.. “తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఒక్క చుక్క గోదావరి లేదా కృష్ణా నీళ్లు కూడా తరలించలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాతే మళ్లీ ఈ ప్రాజెక్టులు పునఃప్రారంభమయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలను ఎత్తిచూపుతూ.. “కాళేశ్వరం ఇప్పుడు కూలేశ్వరం అయింది” అంటూ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి మరిన్ని ప్రణాళికలను వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు, ఆర్ఆర్ఆర్ రోడ్లు, మెట్రో విస్తరణ వంటి ప్రణాళికల ద్వారా నగరాన్ని ప్రపంచస్థాయి మహానగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. “2025 డిసెంబర్ 9న ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ప్రజలకు అంకితం చేస్తాం... రాబోయే 100 సంవత్సరాలపాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపే రోడ్మ్యాప్ సిద్ధం చేస్తాం” అని ప్రకటించారు. చివరిగా.. ప్రాజెక్టు అమలులో ఎవరైనా నష్టపోతే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇస్తూ.. “ఇది ఇందిరమ్మ రాజ్యం – పేదోళ్ల రాజ్యం. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa