రాజీవ్ రహదారి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ముఖ్యమైన రహదారి అయినప్పటికీ, గత కొన్నేళ్లుగా ప్రమాదాల కేంద్రంగా మారింది. రహదారిపై జరిగే మొత్తం ప్రమాదాల్లో సుమారు 40 శాతం ఈ మార్గంలోనే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మలుపుల వద్ద ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనడం, లేదా వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ఎన్నో ప్రాణాలు బలైపోయాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రహదారిని సురక్షితంగా మార్చే దిశగా కొత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ఎక్స్ప్రెస్ హైవే రూపకల్పన
దాదాపు రూ.400 కోట్ల వ్యయంతో రాజీవ్ రహదారిని ఆధునిక ఎక్స్ప్రెస్ హైవేగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కూడా కలుపుతూ కొత్త విస్తరణ జరగనుంది. ప్రస్తుత నాలుగు లైన్ల రహదారిని 8 లైన్లుగా విస్తరించి, మలుపులు పూర్తిగా తొలగించి, అవసరమైతే భూసేకరణ చేసి నూతన మార్గాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల మధ్యగా వెళ్లే ప్రస్తుత రహదారిని మినహాయించి ఊరి బయట కొత్త ట్రాక్ రూపకల్పనతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.
గతంలో జరిగిన కొన్ని పెద్ద ప్రమాదాలు ఇప్పటికీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం గజ్వేల్ రిమ్మనగూడ వద్ద జరిగిన ప్రమాదంలో లారీ డివైడర్ దాటి మరోవైపు వెళ్ళి 13 మంది మరణించారు. అలాగే ఏడాది క్రితం తిమ్మారెడ్డిపల్లి వద్ద బస్సు డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. గౌరారం సమీపంలో జరిగిన ప్రమాదంలో బైక్పై ముగ్గురు వ్యక్తులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఉదంతాలు రహదారి లోపాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి బృందం రెండు సార్లు పరిశీలించినప్పటికీ, రహదారి నిర్మాణంలో జరిగిన లోపాలు ఇప్పటికీ సరిచేయలేదు. డివైడర్ ఎత్తు, వెడల్పు తక్కువగా ఉండటం... సీ ఆకారంలో మలుపులు అలాగే వదిలేయడం, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు దశాబ్దం దాటినా మరమ్మతులు జరగకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమించింది.
ఈ రహదారి. మూడున్నర దశాబ్దాల క్రితం శామీర్పేట నుంచి మంచిర్యాల వరకు 205 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మించబడింది. తరువాత దశాబ్దం క్రితం దీన్ని నాలుగు లైన్ల స్టేట్ హైవేగా విస్తరించారు. ప్రస్తుతం మళ్లీ 8 లైన్ల ఎక్స్ప్రెస్ హైవేగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రహదారి మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, గోదావరిఖని మీదుగా మంచిర్యాల సమీపంలోని జైపూర్ క్రాస్ వరకు విస్తరించి ఉంది. దీని ద్వారా హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాలకు అనుసంధానం ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa