తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ వాతావరణ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల వైపుగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుంచి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.కొన్ని చోట్ల కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా పలు జిల్లాల్లో ఈ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటికే వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్లో అత్యధికంగా 5.92 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఖిల్లా వరంగల్లో 5.57 సెం.మీ., గీసుకొండలో 4.50 సెం.మీ. వర్షపాతం రికార్డయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa