ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ప్రభుత్వానికి చేరిన ఏసీబీ నివేదిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 07:33 PM

ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ - కార్ రేస్ కేసుకు సంబంధించిన నివేదికను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్‌ అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండుసార్లు విచారించారు. అలాగే ఐఏఎస్‌ ఆఫీసర్ అరవింద్‌ను మూడుసార్లు ప్రశ్నించారు. తాజాగా నివేదిక సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్ , అరవింద్ కుమార్‌‍పై ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు గతేడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ - కార్ రేస్ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఫార్ములా ఈ - కార్ రేస్ కోసం రూల్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీని వలన ప్రభుత్వానికి రూ.54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను ఈ కేసులో ఏ1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను ఏ2గా చేర్చారు. HMDA చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు.


ఫార్ములా- ఈ కార్ రేసు నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌, ఏస్‌ నెక్స్ట్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తెలంగాణ పురపాలకశాఖ 2022 అక్టోబరు 25న ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్‌గా ఉన్న ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. అలాగే కార్ రేసు నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11 జరిగిన రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరుఫున హెచ్‌ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు చేసింది. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ భరించింది.


అయితే ఆ తర్వాతి కాలంలో ఫార్ములా ఈ ఆపరేషన్స్స్ సంస్థకు, స్పాన్సర్‌ అయిన ఏస్‌ నెక్స్ట్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఈ ఒప్పందం నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకుంది. దీంతో ఈ రేస్‌కు ప్రమోటర్‌గా, హోస్ట్‌సిటీగా హెచ్‌ఎండీఏనే వ్యవహరించాలని ప్రతిపాదించారు. దీనికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఇక రుసుములు, పన్నుల కింద రూ.110 కోట్లతో పాటుగా రేస్ నిర్వహించాలంటే అవసరమయ్యే పనుల కోసం మరో రూ.50 కోట్లు మంజూరు చేశారు.


ఈ క్రమంలోనే 2023 అక్టోబరు 3వ తేదీన మొదటి వాయిదా, అక్టోబరు 11వ తేదీన రెండో వాయిదా సొమ్ము చెల్లించేలా అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. దీంతో 2023 అక్టోబరు 11న హిమాయత్‌నగర్‌ ఐవోబీ బ్యాంకు నుంచి యూకేలోని ఎఫ్‌ఈవో ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి. అయితే విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల కోసం.. రెగ్యులేటరీ అథారిటీల నుంచి అనుమతి తీసుకోకపోవటంతో పాటుగా ఆర్థికశాఖ అనుమతి లేకుండా చెల్లింపులు చేశారంటూ ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa