ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ పోయిందా? మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 07:37 PM

బస్సులో చోరీచేసిన మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లోని రూ.6 లక్షలను తస్కరించాడు. మొబైల్ పోగొట్టుకున్న బాధితుడు కొత్తది కొనుగోలు చేసి, పాత నెంబరు తీసుకుని ఫోన్‌లో వేయగా.. అతడి రెండు బ్యాంకు ఖాతాల్లో నుంచి నగదు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. విస్తుగొలిపే ఈ ఘటన సికింద్రాబాద్‌‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్‌రావు రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో తిరిగి వెళ్తూ బోయిన్‌పల్లిలో నాందేడ్‌ వెళ్లే మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అతడి జేబులోని ఫోన్‌ను కొట్టేశాడు.


దీంతో బాధితుడు ప్రసాద్‌రావు బోధన్‌లో కొత్త మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసి పాత నంబర్‌పై సిమ్‌ కార్డు తీసుకున్నాడు. సిమ్ తన కొత్త ఫోన్‌లో వేయగానే బ్యాంకు ఖాతాల నుంచి నగదు డెబిట్ అయినట్టు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. దీంతో షాకైన ప్రసాదరావు.. బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అతడి పేరుతో ఉ్న రెండు బ్యాంకు అకౌంట్‌ల నుంచి రూ.6 లక్షలకు పైగా నగదు డ్రా అయినట్లు గుర్తించారు. దొంగను పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిపారు.


మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంటే.. వెంటనే సిమ్ కార్డులతో పాటు బ్యాంకు అకౌంట్లను బ్లాక్ చేసుకోమని పోలీసులు, అధికారులు పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి మోసాలు జరుగుతాయనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అకౌంట్ల ఖాళీ కాక తప్పదు. మొబైల్ ఫోన్‌లో యూపీఐ యాప్‌లు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa