తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మళ్లీ తన సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ముందుకు వచ్చింది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాలను మరింత అర్థవంతం చేయాలనే ధ్యేయంతో, ‘యాత్రాదానం’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
*కార్యక్రమం ఉద్దేశం :ఈ పథకం ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు విరాళాలు ఇచ్చి, అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులు వంటి సామాజికంగా వెనుకబడ్డవారిని ప్రముఖ పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించవచ్చు.
*పోస్టర్ ఆవిష్కరణ : ఈ వినూత్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:"యాత్రలకు వెళ్లాలన్న కోరిక ఎవరికి లేకపోతుంది? కానీ ఆ ఆర్థికంగా వెనుకబడ్డవారికి ఇది సాధ్యంకాదనే భావనను 'యాత్రాదానం' తొలగించబోతోంది. ఇది వారికి ఒక వరంలాంటిదిగా మారనుంది" అని పేర్కొన్నారు.కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా ఈ యాత్ర నిధికి విరాళాలు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
*లక్ష్యం – ప్రయోజనం :ఈ కార్యక్రమం కేవలం ఒక సామాజిక సేవ మాత్రమే కాకుండా, మానవీయ విలువల పెంపుకు దోహదపడే విధంగా రూపొందించబడిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.“ఈ యాత్రలు అనాథలు, వృద్ధులకు జీవితంలో మరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ఆధ్యాత్మికత, సాంస్కృతిక చైతన్యం కూడా కలిసివస్తాయి” అని అన్నారు.సంతోషకరమైన సందర్భాల్లో వ్యక్తులు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, NRIలు, NGOలు వంటి వారు ఈ యాత్రాదాన కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
*అందరికీ అందుబాటులోకి:ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందించింది. దాతలు ఇచ్చే విరాళాల పరిమాణాన్ని బట్టి, AC, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయి.యాత్ర కోసం కనీసం ఒక వారం ముందు స్థానిక ఆర్టీసీ డిపోను సంప్రదించి బస్సులను బుక్ చేసుకోవచ్చు. లేదా, హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.మంత్రి – ఎండీ విరాళంకార్యక్రమానికి మరింత ఉత్సాహాన్నిచ్చేలా, మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఎండీ వీసీ సజ్జనర్ చెరో లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు.మంత్రి విరాళాన్ని అనాథలు మరియు వృద్ధుల యాత్రకు,ఎండీ విరాళాన్ని అక్షయ విద్యా ఫౌండేషన్ విద్యార్థుల విజ్ఞాన యాత్రకు వినియోగించనున్నారు.
*దేశంలోనే తొలి ప్రయోగం:ఇలాంటి కార్యక్రమం దేశంలోనే తొలిసారి తెలంగాణలో ప్రారంభం కావడం గర్వించదగిన విషయం. ఇది సామాజిక సేవకు ఒక కొత్త దిశను సూచించే గొప్ప ప్రయోగంగా నిలవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa