తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈరోజు ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమై, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు.మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్-కరీంనగర్-రామగుండంలను కలిపే రాజీవ్ రహదారిపై ప్యాకేజీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అత్యవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ మార్గంలో ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా, నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మెహదీపట్నం రైతుబజార్ వద్ద పాదచారుల సౌకర్యార్థం స్కై వాక్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి కూడా కొంత రక్షణ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో తెలంగాణలో కొత్తగా సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు తెలంగాణ ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa