ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 25వ తేదీ వరకే ఛాన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 07:34 PM

సెప్టెంబర్ 25వ తేదీ తెలంగాణ రేషన్ కార్డు దారుల కోసం కీలకమైన గడువుగా మారింది. అదేంటి..? ఇక నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోరా..? అని అనుకుంటున్నారా..? అదేం లేదు..? కొత్తగా కార్డులు పొందిన వారు తమ వివరాలను ఈ తేదీ లోపు అప్‌డేట్ చేయకపోతే ఆ పై వచ్చే నెలలో బియ్యం అందదు. అంటే అక్టోబర్ నెలలో బియ్యం ఇవ్వరు. ఇలా మీ వివరాలు అప్ డేట్ కాకపోతే.. రేషన్ కార్డు ఉన్నా.. రేషన్ ఇవ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.


ఇటీవల సూర్యాపేటలోని ఓ మహిళకు రేషన్ కార్డు వచ్చినా, అప్‌డేట్ జరగకపోవడంతో దుకాణంలో బియ్యం అందలేదు. అధికారులు స్పందించి ఆగస్టు 25లోపు రేషన్ కార్డు సమాచారం అప్ డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్ లో రేషన్ అందుతుందని స్పష్టం చేశారు. ఇక అక్టోబర్ నెల రేషన్ కావాలంటే.. సెప్టెంబర్ 25వ తేదీలోగా సదరు వ్యక్తుల పేర్లు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏఎస్ఓ లెవల్లో జరుగుతుంది. మీకు దగ్గర్లోని రేషన్ దుకాణాదారుడి వద్దకు వెళ్లినా.. సమస్యకు పరిష్కారం చెబుతారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డుల మంజూరు వేగం పెరిగింది. ప్రజాపాలనలో మీసేవా ద్వారా దరఖాస్తు చేసినవారికి విడతల వారీగా కార్డులు ఇచ్చారు. జూన్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చినా.. కొత్త కార్డులు పొందిన వారిలో కొందరికి మాత్రమే లభించాయి. జూలై, ఆగస్టు మధ్య దరఖాస్తు చేసుకున్నవారికి సెప్టెంబర్ నుండి బియ్యం అందించాలనే ప్రణాళికతో అధికారులు ముందుకు సాగారు. కానీ సాంకేతిక సమస్యల వల్ల అప్‌డేట్ కాకపోవడంతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.


రేషన్ కార్డు అప్‌డేట్ ప్రక్రియను ఏఎస్ఓ కార్యాలయాలు ప్రతి నెల 25లోపు పూర్తిచేస్తాయి. ఆ తర్వాత నమోదు చేసుకున్నవారికి వచ్చే నెల నుండి సరఫరా ప్రారంభమవుతుంది. అందువల్ల లబ్ధిదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని సూర్యాపేట ఏఎస్‌వో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికీ సరుకులు తప్పనిసరిగా చేరతాయని భరోసా ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది.


కొత్త కార్డుదారులు తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యులందరిని సమీప రేషన్ దుకాణానికి తీసుకెళ్లి బయోమెట్రిక్ నమోదు చేయించాలి. ఇది ఆధార్‌తో అనుసంధానం కావడం వల్ల బినామీలకు అవకాశం లేకుండా చేస్తుంది. ప్రభుత్వం గత రెండేళ్లుగా గడువులు పొడిగిస్తూ వస్తున్నా.. కేవైసీ చేయించుకోని వారి సంఖ్య తగ్గడం లేదు. ఇలానే చేస్తే..వారి రేషన్ కార్డులు కూడా రద్దయ్యే అవకాశాలు ఉంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa