ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో 98.20 ఎకరాల రక్షణ భూములు తెలంగాణకు బదలాయింపు..? కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 07:39 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలను ప్రస్తావించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రాధాన్యతగల ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ సమైక్యత, గాంధేయ సిద్ధాంతాల ప్రాచుర్యం ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.


మూసీ, ఈసీ నదుల సంగమం వద్ద “గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ” నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది దేశంలో సామరస్యానికి ప్రతీకగా నిలవనుందన్నారు. ప్రాజెక్టు పరిధిలో జ్ఞాన హబ్, ధ్యాన గ్రామం, మ్యూజియం, చేనేత ప్రదర్శన కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రణాళిక హైదరాబాద్‌ కు సాంస్కృతిక, పర్యాటక, చారిత్రక ప్రాధాన్యతను తెచ్చిపెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


అంతేకాకుండా.. గాంధీ సిద్ధాంతాలను ఆధునిక తరానికి చేరవేయడానికి ప్రత్యేకంగా రూపొందించే “నాలెడ్జ్ సెంటర్”లో విద్యార్థులు, పరిశోధకులు భాగస్వామ్యం కావడానికి అవకాశం ఉంటుందని రేవంత్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ మాత్రమే కాక.. తెలంగాణ మొత్తం పర్యాటకరంగంలో కొత్త స్థాయికి చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


అయితే ఈ భూములు బదలాయింపు అంశంపై కేంద్రమంత్రి మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన స‌మావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు పొరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, క‌డియం కావ్య, మూసీ రివ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్టర్ ఇవి న‌ర‌సింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, ప‌థ‌కాల స‌మ‌న్వయ‌క‌ర్త డాక్టర్ గౌర‌వ్ ఉప్పల్ పాల్గొన్నారు.


ఇదిలా ఉండగా.. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం ఆమెకు ఘన నివాళి అర్పించారు. 80 ఏళ్ల క్రితమే సామాజిక అన్యాయం, దమనకాండకు వ్యతిరేకంగా స్వరం విప్పిన ధైర్యవంతురాలు ఐలమ్మ అని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమె పోరాటం శాశ్వత స్థానాన్ని సంపాదించిందని తెలిపారు. సమ్మక్క, సారలమ్మలతో పాటు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుందని ఆయన వివరించారు.


చరిత్రలో దొరల అణచివేతకు వ్యతిరేకంగా ధిక్కార పతాకం ఎగరేసిన ఐలమ్మ గౌరవార్థం భవిష్యత్తులో ప్రత్యేక స్మారక చిహ్నం నిర్మాణం చేపట్టే యోచనలో ఉన్నామని కూడా సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఆయన యువతకు ఐలమ్మ ధైర్యస్ఫూర్తి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa