తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూములు అనేవి ప్రభుత్వం నిరుపేదలు, భూమిలేని రైతులు, కూలీలు, వితంతువులు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు జీవనోపాధి కోసం ఉచితంగా కేటాయించే భూములు. ఈ భూములను ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం – భూమి లేని కుటుంబాలకు వ్యవసాయ అవకాశాన్ని కల్పించడం, స్వయం సమృద్ధి దిశగా నడిపించడం.
అసైన్డ్ భూముల కేటాయింపు విధానం..
1954 తర్వాత రాష్ట్రంలో అసైన్డ్ భూముల కేటాయింపు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ భూములు కేవలం సాగు కోసం మాత్రమే వినియోగించాలి. అమ్మకం, బదిలీ లేదా రియల్ ఎస్టేట్ లావాదేవీలు పూర్తిగా నిషేధం. సాగు చేయని పక్షంలో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు.
భూభారతి చట్టం ప్రవేశం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టం అమలు చేసింది. దీని ద్వారా సాగులో ఉన్న రైతులకు శాశ్వత హక్కులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. చాలా కాలంగా సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా రైతులు భవిష్యత్తులో భూమి హక్కుల విషయంలో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఉండే అవకాశం లభించింది.
పరిశీలన ప్రక్రియ..
ప్రభుత్వ భూములపై సాగు చేస్తున్నవారిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు , లైసెన్స్డ్ సర్వేయర్లు కలిసి పరిశీలన చేపడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో భూభారతి గ్రామ సభల ద్వారా 3,404 దరఖాస్తులు అందాయి. వీటిలో 662 మంది కొత్త పాసు పుస్తకాలు లేనివారు ఉండగా.. 43 మంది కాస్తులో లేనివారిగా తేలారు. 1,986 మంది భూములు మోకాపై ఉండగా.. ఆధారాలు లేని 1,445 దరఖాస్తులు గుర్తించారు. 360 మంది ఇతరుల నుండి కొనుగోలు చేసిన కేసులు బయటపడ్డాయి. ఈ వివరాలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోని కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత తుది పరిశీలన చేపట్టి.. అర్హులైన వారికి పట్టాలు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పద్ధతులతో డిజిటల్ ట్రాకింగ్, జియో మ్యాపింగ్, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. పారదర్శక విధానం ద్వారా అర్హులను ఎంపిక చేసి వారికి పట్టాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa