తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అక్రమాలు జరిగినట్లు తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపిక, డేటా అప్లోడ్లో జరిగిన పొరపాట్లు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఇలాంటి ఒక సంఘటన జగిత్యాల జిల్లాలోని భీమారం మండలంలో వెలుగులోకి వచ్చింది. అర్హులైన నిజమైన లబ్ధిదారుల వివరాలను కాకుండా.. తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉదంతం పథకం అమలులో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు ఏం జరిగిందంటే..
జగిత్యాల జిల్లాలోని భీమారం మండలం, ఈదుల లింగంపేట గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై టోల్ఫ్రీ నంబరుకు ఫిర్యాదు అందింది. దీనిపై వెంటనే విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు షాక్కు గురయ్యారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ పుష్పలత, మల్టీపర్పస్ వర్కర్ రాజేష్ ఇద్దరూ లబ్ధిదారుల వివరాలను తప్పుగా అప్లోడ్ చేసినట్లు తేలింది.
నిజమైన లబ్ధిదారుడికి బదులుగా, జమ్మికుంట లావణ్య అనే పేరుతో వివరాలు, ఫోటోలు అప్లోడ్ చేశారు. గ్రామ కార్యదర్శి పుష్పలత కనీసం లబ్ధిదారుల ఇంటికి వెళ్లకుండానే, తన లాగిన్ వివరాలతో తప్పుడు ఫోటోలను అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పొరపాట్ల కారణంగా ఇల్లు వేరే వ్యక్తికి మంజూరైనట్లు అధికారులు నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు.. రాజేష్ను విధుల నుంచి తొలగించగా, పంచాయతీ కార్యదర్శి పుష్పలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యం సొంత ఇల్లు లేని పేదలకు, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడం. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద ఐదు లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సొంత స్థలం ఉన్నవారికి రూ. 5 లక్షలు, స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి నిధులు అందిస్తారు. జగిత్యాల జిల్లాలో జరిగిన సంఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల ఏజెంట్లు, కమీషన్ల కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి తప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడం వల్ల, పథకం పారదర్శకతపై అనుమానాలు కలుగుతున్నాయి. లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు, సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు కూడా కొన్నిసార్లు తప్పుడు వివరాలకు కారణమవుతున్నాయి.
ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో జరిగే అక్రమాలను అరికట్టడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి.. లబ్ధిదారుల ఎంపికలో మరింత నిబంధనలు, అలాగే నిరంతర పర్యవేక్షణ అవసరం. అలాగే.. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇతరులకు ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన అర్హులైన పేదలకు చేరాలంటే.. ప్రభుత్వ యంత్రాంగం, లబ్ధిదారులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa