ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్.. మాగంటి భార్యకే అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 09:11 PM

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించనన్నారు. ఈక్రమంలో పార్టీలన్ని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరు ప్రకటించింది. ఆమె దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య.


తెలంగాణ భవన్‌లో బుధవారం నాడు కేటీఆర్ అధ్యక్షతన జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ భార్య సునీతతో పాటు.. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటిస్తున్నాము అని తెలిపారు. ఆమెకు అందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను. జూబ్లీహిల్స్‌ బైఎలక్షన్‌లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించడమే గోపీనాథ్‌కు ఇచ్చే సరైన నివాళి అన్నారు కేటీఆర్.


ఈ ఉప ఎన్నికలో ఒక్కో ఓటుకు రూ.5 వేలు పంచితే తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా పెద్దల జోలికి వెళ్లదని.. అందుకే సీఎం సోదరుడు చెరువుని ఆక్రమించి ఇల్లు నిర్మించినా పట్టించుకోలేదని.. కానీ పేదల బస్తీలకు వెళ్లి.. వారి ఇళ్లు కూలగొడతుందని కేటీఆర్ విమర్శించారు.


అలానే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సర్వేలు నిర్వహించామని.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చాలా బాగున్నట్లని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. కొన్ని బస్తీల్లో వెనకబడి ఉన్నామని.. అందరం కలిసి కట్టుగా పని చేస్తే పార్టీ గెలుస్తుందని తెలిపారు. కార్యకర్తలు, నాయకులంతా కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం శ్రమించాలి అన్నారు. అలానే ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను తొలగించి.. లేని వారి పేర్లు చేర్చాలన్నారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో సత్తా చాటాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


అనంతరం మాగంటి సునీత మాట్లాడుతూ.. తన భర్త మాగంటి గోపీనాథ్‌లాగే.. తనకు కూడా కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa