మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి గ్రామం సర్వే నంబరు 276లో 1.20 ఎకరాల భూమిని బుధవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది. ఆల్విన్ కాలనీకి ఆనుకుని ఉన్న 276 సర్వే నంబరులో 2.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగాయి. ఇంకా మిగిలి ఉన్న 1.20 ఎకరాల భూమి కబ్జా కాకుండా హైడ్రా కాపాడింది. స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచె వేసింది. అయితే ఈ భూమి తమదంటూ హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ పోరాడుతోంది. ఇదే సమయంలో ఆల్విన్ కాలనీ సంక్షేమ సంఘంతో పాటు ఆ పక్కనే ఉన్న కాకతీయనగర్ కాలనీ వాసులు మాత్రం ఈ భూమిని కాపాడి.. పార్కును నిర్మించాలని లని డిమాండ్ చేస్తున్నారు. ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా.. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా హైడ్రా ఫెన్సింగ్ వేయడంపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీకి 1986లో ప్రభుత్వం 79.29 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. రెండు దశల్లో ప్లాట్ల కేటాయింపు జరిగింది. ఇంకా ఇల్లు రానివారు కొంతమంది ఉన్నారంటూ పక్కనే ఉన్న 2.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని హైదరాబాద్ ఆల్విన్ ఎంప్లాయీస్ హౌసింగ్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు డబ్బులు కూడా చెల్లించినట్టు కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. కమిటీ ప్రతినిధులు కొనకుండానే 2.39 ఎకరాల్లో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆల్విన్ కంపెనీ బంద్ అయ్యింది. ఇంకా ఆ కమిటీ మనుగడలో లేదని.. ఆల్విన్ కాలనీలోని ప్లాట్లు కూడా ఇష్టానుసారం అమ్మేశారని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి ఖాళీ స్థలంలో అక్రమ పార్కింగ్ కొనసాగుతోందని.. దీంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను విచారించిన హైడ్రా.. సర్వేనంబరు 276లో ఉన్నది 2.39 ఎకరాలు ప్రభుత్వ స్థలమే అని నిర్ధారించింది. ఇప్పటికే కొన్ని ఇళ్లు రాగా.. మిగిలి ఉన్న 1.20 ఎకరాల స్థలాన్ని కాపాడి బుధవారం ఫెన్సింగ్ వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa