విద్యార్థులతో సమావేశంలో తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సెల్ఫోన్ నుంచి సినిమా పాటను ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ పాటలోని స్ఫూర్తిదాయక సందేశంతో వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తన పర్యటనలో అనుసరించిన ఈ వినూత్న శైలి అందరినీ ఆకట్టుకుంది.రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి జూపల్లి నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ, ఆదిలాబాద్లోని గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన విద్యార్థులను ఉత్తేజపరిచేందుకు వినూత్నంగా ప్రయత్నించారు. దివంగత నటుడు శ్రీహరి నటించిన ‘భద్రాచలం’ సినిమాలోని ‘‘ఒకటే జననం.. ఒకటే మరణం.. గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు’’ అనే పాటను తన సెల్ఫోన్లో ప్లే చేసి వినిపించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఆత్మహత్య పరిష్కారం కాదని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు ఆరోగ్యంపైనా, క్రీడలపైనా దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు వెంటనే స్పందించి, ఆర్జీయూకేటీ, గురుకుల పాఠశాలకు క్రీడా కిట్లను మంజూరు చేశారు. మంత్రి ప్రసంగం, ఆయన పాట ద్వారా ఇచ్చిన సందేశానికి విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa