ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ 'ఓట్ల చోరీ'కి కౌంటర్‌గా కేటీఆర్ 'ఎమ్మెల్యే చోరీ'.. వీళ్లను గుర్తుపట్టగలరా అంటూ సెటైర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 07:22 PM

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిపై తుది నిర్ణయం స్పీకర్‌కే అప్పగించింది. ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది.. సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే రాజకీయంగా మాత్రం.. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది కదా అంటూ హస్తం పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.


ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పటి ఫొటోలను ఆ ట్వీట్‌లో కేటీఆర్ షేర్‌ చేశారు. ఈ ఫొటోల్లో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న వాళ్లను రాహుల్‌ గాంధీ గుర్తు పడతారా అని ప్రశ్నించారు. వారు ఢిల్లీలో కూడా రాహుల్‌ గాంధీని కలిశారని పేర్కొన్నారు.


ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెబుతున్నారని.. అయితే వారు వేసుకున్నది కాంగ్రెస్‌ పార్టీ కండువా కాదా అని నిలదీశారు. దీనికి రాహుల్‌ గాంధీ అంగీకరిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా.. ఓట్‌ చోరీ కంటే ఇది చిన్న విషయమా అంటూ రాహుల్‌ గాంధీకి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.


పార్టీ మారిన ప్రతీ ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ అగ్రనేతలు స్వయంగా కలిశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ టికెట్ మీద ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు తాము కాంగ్రెస్‌లో చేరలేదని అంటున్నారని.. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని కేటీఆర్ నిలదీశారు. పార్టీ మార్పుపై రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa