ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ నదికి భారీగా వరద నీరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 02:50 PM

హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లను ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పోటెత్తింది. ప్రవాహ ఉద్ధృతి పెరిగి ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు కీలకమైన ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచే ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడం మొదలైంది. దీంతో అప్రమత్తమైన మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు‌. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ముసారాంబాగ్ మార్గాన్ని మూసివేయడంతో వాహనాలను గోల్నాక బ్రిడ్జి వైపు మళ్లించారు. ఫలితంగా గోల్నాక మార్గంలో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది.గత రాత్రి 7 గంటల సమయంలో అధికారులు జంట జలాశయాల గేట్లను మరింతగా ఎత్తివేశారు. ఉస్మాన్‌సాగర్ (గండిపేట) ఐదు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని, హిమాయత్‌సాగర్ నాలుగు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa