ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజిలెన్స్ కమిషన్‌కు ఏసీబీ రిపోర్ట్, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 07:41 PM

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కీలక పురోగతి వచ్చింది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సహా పలువురు నిందితులు ఉన్న ఈ కేసులో ఇప్పటికే సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. రిపోర్ట్‌ను తయారు చేసింది. ఈ రిపోర్ట్‌ను తాజాగా విజిలెన్స్ కమిషన్‌కు అందించింది. దీంతో ఈ రిపోర్ట్‌పై రెండు రోజుల్లో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్న విజిలెన్స్ కమిషన్.. ఆ తర్వాత దీనిపై సమగ్ర నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందించనుంది. అక్కడి నుంచి ఆమోదం రాగానే.. వెంటనే నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీకి అనుమతులు లభించనున్నాయి.


ఇక ఈ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2గా.. హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి A3గా.. మరో ఇద్దరు A4, A5 నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ను మూడు సార్లు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా ఈ కారు రేసింగ్‌లో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో క్విడ్‌ ప్రోకోను అధికారులు స్పష్టమైన సాక్షాధారాలతో నిరూపించినట్లు తెలుస్తోంది.


 ఫార్ములా ఈ కార్ రేసు కోసం స్పాన్సర్‌షిప్‌ చేసిన సంస్థ నుంచి.. ఈ రేస్ నిర్వహించిన సంస్థకు రూ.44 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి బదులుగా ఆ స్పాన్సర్‌షిప్‌ సంస్థ నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌‌ను బీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరిన తర్వాత.. తిరిగి ఏసీబీకి ఆ రిపోర్ట్ చేరనుంది. ఇందులో కేటీఆర్, అరవింద్‌ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డి వంటి నిందితుల ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక ఉండనుండటం గమనార్హం. గత బీఆర్‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హైదరాబాద్ హుస్సేన్‌‌ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్‌‌ను నిర్వహించారు.


ఎలక్ట్రిక్‌‌ కార్ల రేసింగ్‌‌ కోసం బ్రిటన్‌‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌, హైదరాబాద్‌‌కు చెందిన గ్రీన్‌‌కో సిస్టర్ కంపెనీ ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌(ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్‌‌ 25వ తేదీన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 3 ఏళ్ల పాటు నాలుగు సీజన్లకు గాను రూ.600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే హుస్సేన్‌ ‌సాగర్ పరిసర ప్రాంతాల్లో సీజన్ 9, 10, 11, 12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.


2023 ఫిబ్రవరి 11వ తేదీన సీజన్‌‌ 9ను నిర్వహించగా.. పలు కారణాల వల్ల ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌, ఫార్ములా‌‌‌ ఈ ఆపరేషన్స్‌‌ సంస్థల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌కు చెల్లించాల్సిన డబ్బును చెల్లించకపోవడంతో.. ఆ సంస్థ కార్ రేసింగ్‌లను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తెలంగాణ మున్సిపల్‌‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో.. ఐఏఎస్ అర్వింద్‌ ‌కుమార్‌‌‌‌ ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌ 30వ తేదీన మరో కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈవెంట్‌‌ నిర్వహణ కోసం స్పాన్సర్‌‌‌‌ ఫీజు, ట్యాక్స్‌‌లు కలిపి మొత్తం రూ.110 కోట్లు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కార్ రేసింగ్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్‌‌, సివిల్‌‌ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa