ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంకర్‌పల్లి దారి దోపిడీ కేసు.. అసలు సూత్రధారి డ్రైవరే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 07:55 PM

హైదరాబాద్ శివారు శంకర్‌పల్లి ప్రాంతంలో పట్టపగలు దారి దోడీపి జరిగిన విషయం తెలిసిందే. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న మధు అని పోలీసులు నిర్ధారించారు. వికారాబాద్ నుంచి రూ. 40 లక్షల నగదు తీసుకొస్తుండగా సినీ ఫక్కీలో దొంగలు దాడి చేసినట్లు డ్రామా క్రియేట్ చేసిన మధు.. తన గ్యాంగ్‌తో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడు.


ఘటన వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ తన వ్యాపారానికి సంబంధించిన రూ. 40 లక్షలు వసూలు చేయడానికి తన డ్రైవర్ మధు, సహాయకుడు సాయిబాబాను శుక్రవారం ఉదయం వికారాబాద్ పంపించాడు. డబ్బు తీసుకుని వీరు కారులో తిరిగి వస్తుండగా.. శంకర్‌పల్లి మండలం హుస్సేన్‌పూర్-పర్వేద గ్రామాల మార్గంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ కారు రోడ్డుకు అడ్డంగా ఆగిపోయింది.


మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కారు దిగి, డ్రైవర్ మధు, సహాయకుడు సాయిబాబాను రాయితో కారు అద్దం పగలగొట్టి నకిలీ తుపాకీ, కత్తితో బెదిరించారు. వారు భయపడి డబ్బుల బ్యాగు ఇవ్వగానే నిందితులు కారులో పరారయ్యారు. అయితే వారు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లగానే కొత్తపల్లి వద్ద దొంగలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ఈ క్రమంలో డబ్బులున్న బ్యాగులో కొంత మొత్తం కింద పడిపోయింది. నిందితులు సుమారు రూ. 8.5 లక్షలు అక్కడే వదిలేసి మిగతా డబ్బుతో పారిపోయారు.


ఈ ఘటనపై మధు, సాయిబాబా పోలీసులకు సమాచారం అందించారు. అటుగా వచ్చిన శంకర్‌పల్లి పోలీసులు బోల్తా పడిన కారును రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూసి ఆశ్చర్యపోయారు. స్థానికుల నుంచి ఎనిమిదన్నర లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, నిందితులు ఉపయోగించినది నకిలీ తుపాకీ అని గుర్తించారు. అంతేకాకుండా బోల్తాపడిన కారులో పుర్రెలతో చేసిన దండలు, మద్యం సీసాలు కూడా లభ్యమయ్యాయి. ఆ కారు జడ్చర్లకు చెందిన వ్యక్తిదిగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు.


దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఈ కేసులో కొన్ని అనుమానాలు కలిగాయి. మొత్తం సంఘటనను పరిశీలించగా ఇది దారి దోపిడీ కాదని.. పక్కా ప్లాన్ ప్రకారమే ఘటన జరిగి ఉంటుందని గ్రహించారు. ఈ మేరకు డ్రైవర్ మధుపై అనుమానంతో విచారణ వేగవంతం చేశారు. వికారాబాద్ నుంచి నగదు తీసుకు వస్తున్న విషయాన్ని డ్రైవర్ మధు తన గ్యాంగ్‌కు చెప్పి.. దోపిడీకి సంబంధించిన మొత్తం ప్రణాళికను సిద్ధం చేశాడని పోలీసులు కనుగొన్నారు. మధు, సాయిబాబాపై దాడి చేసినట్లు నటించి.. మిగతా దుండగులు డబ్బుతో పారిపోయినట్లు నిర్ధారించారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి డ్రైవర్ మధు అని తేలింది.


ఈ కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దోపిడీకి పాల్పడిన ఏడుగురిని జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో కేసు కొలిక్కి వచ్చింది. డ్రైవర్ మధు ఒక మహా నటుడి మాదిరిగా నటించి.. తనపై దాడి జరిగినట్లు నమ్మించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa