ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పని చేస్తోంది. ఈ బాధ్యతను హైడ్రాకు అప్పగించిన ప్రభుత్వం, నగరంతో పాటు చుట్టుపక్కల ప్రభుత్వ భూముల కోసం జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో 500 కోట్ల రూపాయల విలువైన 12 ఎకరాల భూమిని శనివారం స్వాధీనం చేసుకుంది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శాతంరాయ్ గ్రామంలోని సర్వే నంబర్ 17 లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. చుట్టూ నిర్మించిన ప్రహరీని, లోపల ఉన్న షెడ్డులను తొలగించింది.12 ఎకరాల భూమి స్వాధీనం.. ఈ భూమిని రాష్ట ప్రభుత్తం 2011 లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ భూమి తమదంటూ స్థానికంగా నాయకులుగా చెలామణి అవుతున్న ఓ నాయకుడితో పాటు అనీష్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ క్లెయిమ్ చేస్తోంది. ఈ మేరకు అక్కడ అనీష్ కన్స్ట్రక్షన్ సంస్థ బోర్డులు పెట్టింది. కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించడం తో స్థానికులు హైడ్రాకు ఫోటోలను పంపించారు. రాళ్ళు రప్పలతో వ్యవసాయ వినియోగానికి అవకాశం లేని ఈ ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్నామంటూ.. అసఫ్ జాహీ పైగా కుటుంబ వారసుల నుంచి కొన్నామంటూ కబ్జాదారులు చెబుతున్నారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు కూడా యిదే సమయంలో హైడ్రాకు ఫిర్యాదు చేసారు. యిలా స్థానికులతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు వారు యిచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
శంషాబాద్ పరిధిలో పైగా కుటుంబాలకు చెందిన భూములు లేవని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. వేరే చోట ఉన్న ఆ భూముల రికార్డులను యిక్కడ చూపించి కబ్జాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. అనీష్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన శ్రీపాద దేశ్ పాండే పలు భూముల వివాదాల్లో ఉన్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలించాక... శంషాబాద్ మండలం శాతం రాయ్ గ్రామంలో ఉన్న 12 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తర్వాత.. ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఈ 12 ఎకరాలలో ఒక ఎకరం పరిధిలో వున్న కొన్ని నివాసాలు, ఒక దేవాలయం, మసీదును కాపాడుతూనే మిగతా భూమికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తున్నట్టు హైడ్రా బోర్డు పెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa