ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య, వారణాసికి,,,టీజీఎస్‌ఆర్టీసీ టూర్ ప్యాకేజీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 03:11 PM

టీజీఎస్‌ఆర్టీసీ సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్లకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా ప్రారంభించిన 'యాత్రాదానం' ప్రాధాన్యతను వివరించాలని అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సుల బుకింగ్‌, కార్గో సేవలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల సమావేశంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిపోకు ముగ్గురు చొప్పున బస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్లు తమ ప్రాంతాల్లో ప్రత్యేకమైన, శుభ సందర్భాలలో యాత్రాదానంలో భాగంగా అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులను పుణ్యక్షేత్రాలు లేదా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సజ్జనార్ సూచించారు. యాత్రాదానం కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 21 వేలకు పైగా అద్దె బస్సులు బుక్ చేసినందుకు విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల పనితీరును సజ్జనార్ ప్రశంసించారు. రాబోయే బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.


టీజీఎస్‌ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీలకు మంచి స్పందన లభిస్తోందని.. త్వరలోనే అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. ఉద్యోగుల నిబద్ధత, అంకితభావం వల్లే సంస్థ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గడపకు ఆర్టీసీ సేవలను తీసుకెళ్లడమే విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్‌ల ప్రధాన లక్ష్యం. వీరు తమ పరిధిలోని గ్రామాల్లో, కాలనీల్లో ప్రజలతో నిరంతరం సంప్రదిస్తూ ఉంటారని.. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు వంటి సమాచారాన్ని సేకరించి, వాటిని ఉన్నతాధికారులకు చేరవేస్తారన్నారు. అలాగే, శుభకార్యాలు, జాతరల వంటి వాటికి అద్దె బస్సులను బుక్ చేసుకోవాలని ప్రజలకు వివరిస్తారన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని సజ్జనార్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఈడీలు మునిశేఖర్, వెంకన్న, సోలోమన్, ఖుష్రోషాఖాన్, రాజశేఖర్, సీటీఎంలు శ్రీదేవి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, పెండింగ్ అంశాలను దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు సజ్జనార్ హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa